|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 07:51 PM
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని విష్ణుపూర్ గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ అనే వ్యక్తి.. తన కుమార్తె సునీతను మే 11వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్వా జిల్లా బహోకుందర్ గ్రామానికి చెందిన బుధ్నాథ్ సింగ్ అనే వ్యక్తికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు సునీత.. తనకు తన భర్త బుధ్నాథ్ సింగ్ అంటే ఏ మాత్రం ఇష్టం లేదని అందరి ముందే చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాలు షాక్కు గురయ్యాయి. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పంచాయతీ పెట్టి.. ఆ నవ వధువు సునీతకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి తీసుకెళ్లారు.
అయితే అప్పుడు సరే అని అత్తగారింటికి వెళ్లిన సునీతకు భర్త అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. అది మనసులో పెట్టుకున్న సునీత.. ఎలాగైనా భర్త బుధ్నాథ్ సింగ్ను చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత శనివారం రోజున భర్తతో కలిసి సునీత మార్కెట్కు వెళ్లింది. అయితే కూరగాయ చెట్లు పాడవుతున్నాయని.. వాటికి మందు కొట్టాలనే నెపంతో భర్తతో పురుగులమందు కొనిపించింది. ఆ తర్వాతి రోజు ఆదివారం రాత్రి భర్త తినే భోజనంలో ఆ పురుగుల మందును కలిపి పెట్టింది. అయితే అది తెలియని.. భర్త భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేవకపోవడంతో.. చనిపోయాడని నిర్ధారించుకున్నారు. రాత్రి తిన్న భోజనంలో విషం కలపడంతో ఆ వ్యక్తి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.
బుధ్నాథ్ సింగ్ చనిపోయాడని తెలుసుకున్న అతడి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు.. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బుధ్నాథ్ సింగ్ భార్య సునీతనే కావాలని.. అతడు తినే భోజనంలో విషం కలిపి చంపేసిందని పోలీసులకు అతడి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. భార్య సునీతను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా బయటికి రావడం గమనార్హం. ఇటీవల హనీమూన్ హత్య ఘటన పూర్తిగా మరిచిపోకముందే.. అచ్చం అలాంటిదే ఇంకో ఘటన చోటు చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
Latest News