కిడ్నీ ఫెయిల్ అయితే శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:01 PM

మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. అవి చిక్కుడు గింజ ఆకారంలో వెన్నెముకకు ఇరువైపులా, పక్కటెముకల క్రింద ఉంటాయి. వాటి ప్రధాన విధులు కేవలం వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలోని సమతుల్యతను కాపాడటానికి అనేక కీలక పాత్రలు పోషిస్తాయి. శరీరంలో మూత్రపిండాలు ప్రధానంగా రక్తాన్ని వడపోసి, వ్యర్థ పదార్థాలను, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఈ విధి సరిగ్గా జరగనప్పుడు, వ్యర్థాలు, ద్రవాలు శరీరంలో పేరుకుపోయి, విషపూరితంగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ పరిస్థితినే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు.


​కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక భాగాలలో కనిపిస్తుంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే కొన్ని సంకేతాల్ని గుర్తించడం చాలా ముఖ్యం. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కొన్ని శరీర భాగాల్లో నొప్పి వస్తుంది పలు అధ్యయనాలు, నివేదికలు చెబుతున్నాయి. ఆ సంకేతాల ద్వారా కిడ్నీ వ్యాధులను గుర్తించవచ్చు. మూత్రపిండాలు వైఫల్యం అయితే శరీరంలో ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మూత్రపిండాల వ్యాధి అత్యంత సాధారణ లక్షణం నడుము లేదా వీపు నొప్పి. కానీ దీనిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నడుము నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. ప్రారంభంలో, ఈ నొప్పి తక్కువగా ఉంటుంది. కానీ క్రమంగా అది తీవ్రం కావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ఈ నొప్పి మూత్రపిండాలు ఉన్న వీపులో ఒక వైపు ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి ఎక్కువ కాలం కొనసాగి, మెడిసిన్ తీసుకున్నా తగ్గకపోతే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు మూత్రపిండాల ఇన్ఫెక్షన్, రాళ్ళు లేదా మూత్రపిండాల వైఫల్యానికి ముందస్తు హెచ్చరిక కావచ్చు.


కడుపు లేదా పైభాగంలో నొప్పి


కిడ్నీ వ్యాధి కడుపు తిమ్మిరి లేదా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. దీంతో పాటు కడుపు ఉబ్బినట్లు కూడా అనిపించవచ్చు. తరచుగా ఈ కడుపు నొప్పి గ్యాస్ లేదా అజీర్ణంలా అనిపిస్తుంది. ఇది చాలా మందిని గందరగోళానికి గురి చేస్తుంది. కానీ కిడ్నీ సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కడుపులో మంట లేదా వాపుకు కారణమవుతుంది. ముఖ్యంగా కడుపు నొప్పితో పాటు మూత్రం రంగు లేదా వాసనలో మార్పు ఉంటే, ఇది కిడ్నీకి సంబంధించిన తీవ్రమైన సంకేతం కావచ్చు.


తొడలు, కాళ్ళలో నొప్పి లేదా వాపు


మూత్రపిండాల వైఫల్యం కారణంగా, శరీరంలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం మొదట మొత్తం కాలు, తొడపై కనిపిస్తుంది. కాళ్ళలో వాపుతో పాటు నొప్పి లేదా భారంగా అనిపించడం లేదా కొన్నిసార్లు నరాల కుదింపు వంటి నొప్పి మూత్రపిండాల సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే కాళ్ళలో వాపు కనిపించి, రోజు గడిచేకొద్దీ ఈ వాపు పెరుగుతుంటే, అది మూత్రపిండాల వైఫల్యానికి ప్రత్యక్ష సంకేతం కావచ్చు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి. వైద్యుణ్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఛాతీలో లేదా పక్కటెముకల కింద నొప్పి


మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరియా, విషాన్ని తొలగించలేనప్పుడు, అది గుండె , ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా.. ఛాతీలో బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్కటెముకల కింద నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధి స్థాయి పెరిగినప్పుడు, ఈ లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అందుకే ఈ లక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి.


తలలో, కళ్ళ వెనుక నొప్పి


మూత్రపిండాల వ్యాధి రక్తపోటు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా ఈ నొప్పి కళ్ళ వెనుక ఉన్నట్టు అనిపిస్తుంది. అది అధిక రక్తపోటు, మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడానికి సంకేతం కావచ్చు. మూత్రపిండాల వైఫల్యం శరీరంలో నీరు, ఉప్పు సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. దీని కారణంగా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. తలలో భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది.


ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి


* నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం, శక్తి లేకపోవడం


* ఆకలి లేకపోవడం, తినాలనే కోరిక తగ్గడం


* వికారం, వాంతులు.. ఈ లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తాయి.


* నిద్ర పట్టకపోవడం లేదా తరచుగా మేల్కొనడం


* శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల తీవ్రమైన దురద


* మూత్రం తక్కువగా లేదా పూర్తిగా ఆగిపోవడం


* మానసిక గందరగోళం


* ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వల్ల శ్వాస ఆడకపోవడం

Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM