![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:02 PM
విశాఖ వేదికగా జూన్ 21న జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యోగా దినోత్సవ వేడుకలపై ఈరోజు (మంగళవారం) మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని సాగరిక హాలులో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యోగా డేకు సంబంధించి మంత్రి లోకేష్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచం మనవైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పక్కా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. సూరత్లో జరిగిన ఈవెంట్ను స్టడీ చేసి.. పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇదొక చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు. ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన క్రతువు ఇది అని చెప్పుకొచ్చారు. ప్రజలు 600 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవకూడదని.. ఆ మేరకు వాహన సదుపాయం కల్పించాలని అన్నారు. జియో, ఎయిర్టెల్ నెట్వర్క్ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని.. ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు చేశారు.
Latest News