ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు భారత టెలికాం శాఖ నుంచి కీలక అనుమతులు
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:51 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ, భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే దిశగా కీలక అడుగు వేసింది. ఇటీవలే టెలికమ్యూనికేషన్స్ విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ నుంచి అవసరమైన అనుమతులు పొందింది. దీంతో దేశంలో త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌, రిలయన్స్ జియో సంస్థలు కూడా ఇలాంటి అనుమతులు సాధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, స్టార్‌లింక్ సేవల ధరలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.స్టార్‌లింక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో తన సేవలను అందిస్తోంది. ఇటీవల పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ డేటా రిసీవర్ హార్డ్‌వేర్‌ కోసం సుమారు రూ.33,000 వసూలు చేస్తుండగా, నెలవారీ ప్లాన్‌ల ధరలు రూ.3,000 నుంచి మొదలవుతున్నాయి. భారతదేశంలో కూడా దాదాపు అవే ధరలు వర్తించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం మేరకు సీఎన్‌బీసీ-18 ఒక కథనంలో వెల్లడించింది.అయితే, ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థలు అందిస్తున్న ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ధరలతో పోలిస్తే స్టార్‌లింక్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీలు తీవ్రమైన పోటీ కారణంగా ఉచిత ఇన్‌స్టలేషన్‌తో పాటు, 100 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను వెయ్యి రూపాయలలోపే అందిస్తున్నాయి. వీటికి అదనంగా ఓటీటీ, టీవీ ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి.ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని, టెలికాం సిగ్నళ్లు సరిగా అందని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి స్టార్‌లింక్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టార్‌లింక్ తన సేవలను సంప్రదాయ ఉపగ్రహాల ద్వారా కాకుండా, భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) ఉపగ్రహాల ద్వారా అందిస్తుంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు ఇలాంటివి 7,000 ఉపగ్రహాలు ఉండగా, భవిష్యత్తులో వీటి సంఖ్యను 40,000కు పెంచాలని సంస్థ యోచిస్తోంది.లైసెన్స్‌లు పొందినప్పటికీ, ఈ సంస్థలు వాణిజ్య శాట్‌కామ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ సేవల కోసం స్పెక్ట్రమ్ ధరలు, నియమ నిబంధనలపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే ప్రభుత్వానికి తన సిఫారసులను పంపింది. ప్రభుత్వం తుది మార్గదర్శకాలను జారీ చేసి, స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తి చేసిన తర్వాతే ఈ కంపెనీలు తమ సేవలను ప్రారంభించగలుగుతాయి. దీనికి అదనంగా, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి మరో ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM