అక్టోబర్‌లో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:18 PM

అక్టోబర్‌లో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో రైల్‌ అధికారులు సోమవారం పరిశీలించారు. అనంతరం.. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు గురించి కీలక వివరాలు వెల్లడించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును 46.22 కి.మీ మేరకు నిర్మించనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రోలో మొత్తం 42 స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ కోసం రూ.11000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకూ.. మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశించిన ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు.


మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజక్టు నిర్మాణ పనులను అక్టోబర్ నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు. విశాఖ మెట్రో పనులను అక్టోబరులో ప్రారంభిస్తామని.. డబుల్‌ డెక్కర్‌ విధానంలో నిర్మించేలా డీపీఆర్ రూపొందించినట్లు నారాయణ ఇటీవల వివరించారు. మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ నియామకం కోసం.. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఏప్రిల్ నెలాఖరులో బిడ్లను కూడా ఆహ్వానించింది.


మరోవైపు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మూడు కారిడార్లలో నిర్మించాలని డీపీఆర్ రూపొందించారు. మొదటి దశలో మూడు కారిడార్లలో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 46.22 కి.మీ. మేరకు 42 స్టేషన్లతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు-కొమ్మాది కూడలి వరకు ఒక కారిడార్ నిర్మించనున్నారు. ఈ కారిడార్‌ 34.40 కి.మీ మేర ఉండనుంది. ఈ కారిడార్‌లో 29 మెట్రోస్టేషన్లు ప్రతిపాదించారు. అలాగే గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు రెండో కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ కారిడార్‌లో 5.07 కి.మీ.లలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. తాటిచెట్లపాలెం - చినవాల్తేరు 6.75 కిలోమీటర్ల మేరకు మూడో కారిడార్ నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో 7 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి.


అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్టులో ఐదు ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు కూడా ఉండనున్నాయి. రెండు, మూడు ప్రాంతాలను కలుపుతూ ఐదు చోట్ల ఈ ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్‌ఏడీ కూడలి, తాటిచెట్లపాలెం, గురుద్వారా కూడలి, మద్దిలపాలెం, హనుమంతువాక కూడలి వద్ద ఈ సమీకృత మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కేంద్రం అందించే సహకారంతో పాటుగా.. బ్యాంకుల నుంచి రుణం సేకరించనున్నారు. ఆందులో భాగంగానే ఏడీబీ ప్రతినిధులు సోమవారం విశాఖలో పర్యటించారు.

Latest News
PM Modi's 'lalten-panja' jab at RJD-Cong, says Bihar's role vital in Viksit Bharat goal Fri, Jun 20, 2025, 02:46 PM
Delhi: Three thieves arrested, six stolen phones recovered Fri, Jun 20, 2025, 02:43 PM
India's economy showing strong signs of growth: Report Fri, Jun 20, 2025, 02:31 PM
Bangladesh faces COVID-19 vaccine shortage amid new variant surge Fri, Jun 20, 2025, 01:22 PM
India Army champions global Yoga Day celebrations in Kazakhstan, Uzbekistan, Myanmar Fri, Jun 20, 2025, 01:19 PM