![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:10 PM
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు అరెస్ట్పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కొమ్మినేని అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అవుతున్నాయని.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచక, అన్యాయ పాలనపై ప్రజల తరఫున ఎవరూ గొంతెత్తకుండా అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. తన దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి, వైఫల్యాలపై స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు.
70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును తాను చేయని వ్యాఖ్యలకు అరెస్టు చేసి కక్షసాధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. డిబేట్ జరిగే సమయంలో వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం ఉంటుందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతారని జగన్ గుర్తు చేశారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో జరగలేదా.. ఇప్పటికీ కొనసాగడం లేదా అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని పథకం ప్రకారం.. ఇలా లేని వాటిని ఆపాదిస్తూ, విషయాలను పక్కదోవ పట్టిస్తూ వక్రీకరిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదన్న వైఎస్ జగన్.. గతంలోనూ ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవనే కారణంతో కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చింది ఐదేళ్లేనని.. అందులో ఏడాది ఇప్పటికే పూర్తైందని జగన్ గుర్తు చేశారు.
మరో నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని వైఎస్ జగన్ సూచించారు. ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుందని. అది రెండింతలవుతుందని మర్చిపోకండంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.