లోకేశ్ ట్వీట్ తర్వాతే కుట్రపై అనుమానం బలపడిందని సజ్జల వెల్లడి
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:06 PM

లోకేశ్ ట్వీట్ తర్వాతే కుట్రపై అనుమానం బలపడిందని సజ్జల వెల్లడి

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని, మూడు రోజులుగా రాద్ధాంతం చేసి, దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు.ఈ నెల 6వ తేదీ ఉదయం సాక్షి ఛానల్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని సజ్జల తెలిపారు. ఆ విశ్లేషకుడు "అమరావతి చుట్టుపక్కల" అంటూ ప్రస్తావించినప్పుడు, కార్యక్రమ మోడరేటర్‌గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకుని, "అవన్నీ ఎందుకులేండి, ఆ పేరు చెబితే దైవదూషణలా భావిస్తారు, జాగ్రత్తగా ఉండండి" అని వారించినట్లు సజ్జల గుర్తుచేశారు. ఆ వ్యాఖ్య అక్కడితో ముగిసిపోయిందని, దానిని ఛానల్ గానీ, పత్రిక గానీ పునరావృతం చేయలేదని, కృష్ణంరాజు గానీ, కొమ్మినేని గానీ ఆ తర్వాత ఆ అంశంపై ఎక్కడా మాట్లాడలేదని ఆయన అన్నారు.అయితే, 7వ తేదీ ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందిన మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు ఈ అంశాన్ని పట్టుకుని దుష్ప్రచారం మొదలుపెట్టాయని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ అదేరోజు మధ్యాహ్నం 3 లేదా 3:30 గంటలకు ట్వీట్ చేసిన తర్వాత, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ వ్యవహారంలా జరుగుతోందన్న అనుమానం తమకు కలిగిందని ఆయన పేర్కొన్నారు."సాక్షి మీడియా జగన్ కుటుంబానికి చెందింది కాబట్టి, వారిపై వ్యక్తిగత దాడులు మొదలుపెట్టారు. ఛానల్ ఉద్దేశం ఇది కాదని, ఎడిటర్ ఉద్దేశం కాదని, కొమ్మినేని గారి ఉద్దేశం కూడా కాదని, చివరకు ఆ విశ్లేషకుడు కూడా ఆ వ్యాఖ్యను ఉద్దేశపూర్వకంగా పొడిగించలేదు" అని సజ్జల వివరించారు. సాక్షి మీడియా ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ఇలాంటి వాటిని ప్రోత్సహించబోమని, ఖండిస్తున్నామని ప్రకటన చేసిందని, విశ్లేషకుడు కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని తెలిపారు. వైసీపీ కూడా పార్టీపరంగా దీనిని ఖండించిందని, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసిందని అన్నారు.తమ హయాంలో ఏబీఎన్, టీవీ5 వంటి ఛానళ్లలో జగన్ పైనా, వైసీపీ నేతలపైనా వందలకొద్దీ చర్చల్లో దుర్భాషలాడారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోలేదని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే వాటిని వదిలేశామని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం లేని సమస్యలను సృష్టించి, అసలు విషయాలను పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. "ఇది చంద్రబాబు గారికి పాత అలవాటే. బలహీనులు, అసమర్థులు, పిరికివాళ్లు, సత్తా లేనివాళ్లు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు" అని సజ్జల వ్యాఖ్యానించారు.7వ తేదీ నుంచి ఫిర్యాదులు మొదలుపెట్టి, 8వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం, సాక్షి ఆఫీసులపై దాడులకు యత్నించడం వంటి చర్యలతో అరాచకం సృష్టించారని సజ్జల ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీ ఆధ్వర్యంలోనే నడుస్తోందని ఆయన అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ కుట్రలో భాగమేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు

Latest News
Australia suspends embassy in Iran, directs officials to leave Fri, Jun 20, 2025, 03:41 PM
Russia shot down over 61 Ukrainian drones overnight Fri, Jun 20, 2025, 03:35 PM
1st Test: Sudharsan handed debut as England elect to bowl first against India at Headingley Fri, Jun 20, 2025, 03:33 PM
UN warns of looming famine in Yemen Fri, Jun 20, 2025, 03:33 PM
PM Modi's 'lalten-panja' jab at RJD-Cong, says Bihar's role vital in Viksit Bharat goal Fri, Jun 20, 2025, 02:46 PM