|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:24 PM
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు చింతగింజల పొడి చక్కటి ఆయుర్వేద ఔషధంగా పేరుగాంచింది. అంతేకాకుండా ఈ పొడి ఫార్మా కంపెనీలు, రంగుల పరిశ్రమ, పట్టువస్త్రాల తయారీలో విరివిగా వినియోగిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఈ రంగం, వేలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. దక్షిణ భారతదేశంలో చింతగింజల వ్యాపారం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉన్నా… విక్రయదారులు తక్కువగా ఉండటం విశేషం. తాజాగా చింతపండు ధరల పెరుగుదలతో చింతగింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కిలో చింతగింజలు రూ.30-35 మధ్య ఉండగా… ఇప్పుడు రూ.40-44 వరకు పలుకుతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా చింతగింజలు పుంగనూరుకు వస్తున్నాయి. పుంగనూరులో ఉన్న మిషన్లలో గింజల పొట్టు తీసి, పరిశుభ్రంగా వేరు చేస్తారు. ఒక్క పుంగనూరులోనే 12 మిషన్ల ద్వారా రోజూ సుమారు 200 టన్నుల చింతగింజలు (పొట్టు తీసినవి) వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ గింజలను హిందూపురం, మధురై, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, వాపి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పొడిచేసి పారిశ్రామిక వినియోగానికి సిద్ధం చేస్తారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు మందుల తయారీకి, రంగుల పరిశ్రమ, పట్టువస్త్రాల గంజి, మస్కట్ కాయిల్స్, ఫ్లైవుడ్, ప్లాస్టిక్, పేపర్, జ్యూట్ పరిశ్రమల్లో ఈ చింతగింజల పొడికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకవేళ విస్తృతంగా పరిశ్రమల్లో వినియోగించే ఈ గింజల వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందితే… మరిన్ని ఉపాధి అవకాశాలు, దేశ విదేశాల్లో ఎగుమతుల ద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Latest News