![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:01 PM
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘ఎన్నారై తెలుగుదేశం, స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థ’ల ఆధ్వర్యంలో శనివారం నాడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి గెలుపునకు ఎన్నారైలు చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 2019-24 మధ్య రాష్ట్రంలో అవినీతి, రాక్షస పాలన సాగిందని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి జైలుకు పంపారని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గట్టిగా పోరాడినా వారు కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టారని, నాసిరకం బ్రాండ్లతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే 68 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు లోకేష్ బాబు అండగా ఉన్నారని అన్నారు. లోకేష్ పనితీరు చూసి, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన కుటుంబాన్ని ఆహ్వానించి రెండు గంటల పాటు గడిపారంటే, లోకేష్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోమిరెడ్డి వివరించారు.
Latest News