![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:07 PM
దేశ రాజధాని ఢిల్లీలో వీధి పశువుల బెడద మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఛత్తర్పూర్ ప్రాంతంలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన స్కూటర్ వద్ద నిల్చున్న ఒక వృద్ధుడిపై అకస్మాత్తుగా దాడి చేసింది. కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టింది. ఈ భయానక ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళితే... ఛత్తర్పూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు తన స్కూటర్ దగ్గర నిల్చుని ఉండగా, ఎక్కడినుంచో దూసుకొచ్చిన ఓ భారీ గిత్త అతడిపై దాడి చేసింది. తన పదునైన కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి, కిందపడేసి, కాళ్లతో విచక్షణారహితంగా తొక్కింది. ఆ తర్వాత బాధితుడిని రోడ్డు మధ్యలోకి ఈడ్చుకెళ్లి మళ్లీ దాడి చేసింది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు వెంటనే స్పందించి, కర్రలు, రాడ్లతో ఎద్దును తరిమివేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎద్దును బెదిరించబోయిన ఒక మహిళను కూడా అది కిందకు తోసేసింది. చివరకు, అతికష్టం మీద స్థానికులు బాధితుడిని కాపాడి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీలో వీధి పశువుల దాడులు కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కల్కాజీ ఎక్స్టెన్షన్లోని సెయింట్ జార్జ్ స్కూల్ బయట సుభాశ్ కుమార్ ఝా (42) అనే వ్యక్తిపై ఓ ఎద్దు దాడి చేయడంతో అతను మరణించాడు. తన కొడుకును స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దాడిలో అతని పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే నెలలో దక్షిణ ఢిల్లీలోని తిక్రీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజాగా ఛత్తర్పూర్లో జరిగిన ఘటనతో నగర ప్రాంతాల్లో వీధి పశువుల సమస్యపై మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఒక సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ, "ఇది భారతదేశ ప్రజలకు పెద్ద సమస్య. రోజూ ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైనా చేయాలి. జంతువులతో ప్రమాదాల్లో ప్రజలు చనిపోతున్నారు. ఎద్దులు రోడ్లపై మనుషుల్ని చంపుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News