మా నాన్న ముద్రగడకు క్యాన్సర్.. కుమార్తె క్రాంతి
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 04:26 PM

వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ కుమార్తె క్రాంతి సంచలన విషయాలను బయటపెట్టారు. తండ్రి ఆరోగ్యంపై ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. కానీ ఆయనకు సరైన వైద్యం కూడా అందించడం లేదన్నారు. ఆయన్ను ఎవరూ కలవకుండా ఒకచోట బంధించినట్లు చెప్పుకొచ్చారు.. తన సోదరుడు గిరిపై క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు.


'మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయనకు అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారు.. ఈ విషయంలో నేను తీవ్రంగా ఆందోళనతో ఉన్నాను. ఇటీవల ఒక మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.. కానీ నా సోదరుడు గిరితో పాటూ అతని మామ మా నాన్నగారిని కలవడానికి అనుమతించలేదు. నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు.. ఆయన బంధువులకు, ఎప్పటి నుంచో వెంట నడస్తున్న అనుచరులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గిరితో పాటూ అతని అత్తమామల సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని.. ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని నాకు తెలిసింది. గిరి ఇది అమానుషం, ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే.. నాకు కచ్చితంగా స్పష్టంగా చెప్పాలి.. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్నగారికి సంరక్షణ అవసరం' అంటూ ట్వీట్ చేశారు.


ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి ఓ లేఖను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను అనారోగ్య కారణాలతో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని ప్రస్తావించారు. ఈ క్రమంలో ముద్రగడ కుమార్తె క్రాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ముద్రగడ కుమారుడు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.


ముద్రగడ పద్మనాభం గతంలో పార్టీలకు దూరంగా కాపు ఉద్యమ నేతగా ఉన్నారు.. అయితే 2024 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని భావించారు. ఈ క్రమంలో ముద్రగడ జనసేన పార్టీలో చేరాలని భావించారు.. కానీ ఆ పార్టీ నుంచి ఆహ్వానం రాకపోవడంతో అనూహ్యంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం పనిచేశారు. అక్కడితో ఆగకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేశారు.. ఎన్నికల్లో పవన్ గెలవడంతో తన సవాల్‌కు కట్టుబడి తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారు.

Latest News
Bangladesh suicide rates surge in 2020-24, 40 people died daily Tue, Dec 23, 2025, 04:09 PM
EAM Jaishankar meets Lankan ministers, reiterates India's full support Tue, Dec 23, 2025, 04:04 PM
Resolving Delhi's inherited problems on all fronts: CM Rekha Gupta Tue, Dec 23, 2025, 03:55 PM
Free trade pact with New Zealand India's first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM