|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 06:39 PM
గత ఐదున్నరేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా మహమ్మారి మరోసారి మళ్లీ ఉధృతమవుతోంది. సింగ్పూర్, హాంకాంగ్, చైనా వంటి ఆసియా దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. భారత్లోనూ కోవిడ్-19 కేసులు గత వారం పది రోజులుగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకుంది. అలాగే, దేశంలో ఒమిక్రాన్కు చెందిన రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్టు ఇండియన్ కోవిడ్ కన్సార్టియం (ఇన్సాకాగ్) డేటా వెల్లడించింది. వారం రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 100కి పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి కేంద్ర కోవిడ్ డ్యాష్బోర్డు సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,009గా ఉంది, దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదయ్యాయి. దేశంలో నాలుగు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రాల వారీగా కేరళ: 430 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి మహారాష్ట్ర (209 కేసులు), ఢిల్లీ ( 104 కేసులు), గుజరాత్ (83 కేసులు), కర్ణాటక (47 కేసులు), ఉత్తరప్రదేశ్ (15 కేసుల), పశ్చిమ్ బెంగాల్ (12 కేసులు)లో ఎక్కువ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదు.
కరోనాతో మహారాష్ట్రలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. కేరళ: ఇద్దరు, కర్ణాటకలో ఒకరు చనిపోయారు. మహారాష్ట్ర థానే ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వారం బృహన్ ముంబయి పరిధిలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయి మరణించిన నాల్గవ వ్యక్తి ఇతడు. ఈ నలుగురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.
ప్రస్తుతం కరోనా కేసులకు జేఎన్ 1 వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచి వచ్చింది. మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మరణించాడు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. నగరంలోని వైట్ఫీల్డ్ నివాసి అయిన ఈ వృద్ధుడు మే 17న చనిపోయినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది.
చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, ఆ:దోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ మాత్రమే కేసులు నమోదవుతున్నాయని.. అవి కూడా చాలా అరుదుగా ఉన్నాయన్నాయని తెలియజేస్తున్నారు.
Latest News