కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతుంది
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 07:45 PM

ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇటీవల అనేక ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయడానికి అంగీకరించడంతో భారత ప్రతిష్ట విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. కెమెరాల ముందు మాత్రమే ప్రధాని మోదీ రక్తం ఎందుకు మరుగుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎవరు అడిగారని నిలదీశారు.


మొదట ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన రాహుల్ గాంధీ.. మోదీ డొల్ల ప్రసంగాలు ఇక ఆపండి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదంపై పాకిస్తాన్ చేసిన ప్రకటనను మీరు ఎందుకు నమ్మారని ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్‌కు తలొగ్గి భారతదేశ ప్రయోజనాలను ఎందుకు త్యాగం చేశారని నిలదీశారు. ఇక కెమెరాల ముందు మాట్లాడుతున్నపుడు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతుందని ప్రధానిని ప్రశ్నించారు. భారతదేశ ప్రతిష్ట విషయంలో ప్రధాని మోదీ రాజీపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి లేదా సైనిక చర్యకు మద్దతు ఉండదని పాకిస్తాన్ ఇచ్చిన హామీని భారత్ పరిగణనలోకి తీసుకుందని ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఉన్న ఒక వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు.


రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ట్యాగ్ చేశారు. ఆ వీడియోలో "మోదీ మనసు చల్లగా ఉంటుంది, అది చల్లగానే ఉంటుంది, కానీ మోదీ రక్తం మాత్రం వేడిగా ఉంటుంది. ఇప్పుడు రక్తం కాదు, మోదీ సిరల్లో వేడి సిందూరం ప్రవహిస్తోంది" అని ప్రధాని మోదీ మాట్లాడినట్లు ఉంది. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ గౌరవం విషయంలో కేంద్రం ఎందుకు రాజీ పడిందని.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌కు మద్దతిస్తూ.. పాకిస్తాన్‌ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. భారత్‌-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను ఎవరు అడిగారని రాహుల్ ప్రశ్నించారు.


 భారత్‌, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ మూడో వ్యక్తి మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు వేసింది. భారత సాయుధ దళాలు బలంగా, ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన దాడులు చేస్తున్న సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ పదేపదే తాను భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని ప్రభావితం చేసి.. చర్చలకు మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు కారణం అయ్యానని ప్రకటిస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. జాతీయ విధానాన్ని ఉల్లంఘించి మూడో పార్టీ మధ్యవర్తిత్వంపై కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వాదనలను విదేశాంగ శాఖ ఖండించింది. కాల్పుల విరమణ చర్చలు కేవలం భారత్, పాకిస్తాన్ మధ్య మాత్రమే జరిగాయని పేర్కొంది.


ఇక ఇదే విషయంపై తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్‌పైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని ఆరోపిస్తూ ఆ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌కు రాహుల్‌ కొత్త పేరు పెట్టారు. జైశంకర్‌ కాదని.. జేజే అని విమర్శించారు. మీడియాతో జైశంకర్ మాట్లాడిన వీడియోను ట్యాగ్‌ చేసిన రాహుల్ గాంధీ.. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భారతదేశాన్ని పాకిస్తాన్‌తో ఎందుకు కలిపి చూస్తున్నారని.. పాకిస్తాన్‌ను ఖండించడంలో ఒక్క దేశం కూడా భారత్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదని అడిగారు. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను ఎవరు అడిగారని ప్రశ్నించారు. భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిణామలపై కాంగ్రెస్‌ నేతలు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను (జేజే) జైచంద్‌ జైశంకర్‌ అని సంబోధిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో జైచంద్‌ జైశంకర్‌ పేరు ఎందుకు పెట్టారా అనే సందేహం అందులో కలిగింది. దీంతో అసలు జైచంద్ జైశంకర్ అంటే ఏంటి అంటూ నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ప్రముఖ కవి పృథ్వీరాజ్ రాసోకు చెందిన కవితలో రాజ్‌పుత్ పాలకుడు జైచంద్, మరొక రాజ్‌పుత్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా ఘోరీ ముహమ్మద్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఉంటుంది.

Latest News
Delhi Police busts MDMA supply module, arrests two Fri, Apr 17, 2026, 04:23 PM
Raghav Chadha greets Harivansh on starting 'third innings' as Rajya Sabha Deputy Chairman Fri, Apr 17, 2026, 04:15 PM
Democracy in India becoming stronger: Jagdambika Pal refutes Priyanka Gandhi's charges Fri, Apr 17, 2026, 04:11 PM
Gold up 10 pc amid global uncertainty, outlook remains constructive Fri, Apr 17, 2026, 04:06 PM
IPL 2026: When and Where to watch RCB vs DC, know all details Fri, Apr 17, 2026, 03:59 PM