![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 07:13 PM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. లిక్కర్ షాపు వద్ద సిట్టింగ్ రూమ్ లేకపోవడంతో నడిరోడ్డుపైనే బాటిల్ పట్టుకుని నిరసన తెలిపాడు. సిట్టింగ్ రూములు ఏర్పాటు చేయకపోతే మళ్ళీ వచ్చి ఇక్కడే తాగుతానని హెచ్చరించాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పర్మిట్ రూములు రద్దు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. త్వరలో పర్మిట్ రూములకు అనుమతిచ్చే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది.
కామాతురాణాం న భయం న లజ్జ.. ఇది పెద్దలు చెప్పేమాట. అంటే కామంతో కళ్లుమూసుకుపోయిన వాడికి సిగ్గూ, భయం ఉండవని అర్థం. అయితే పెద్దలు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ.. ఈ సామెత అక్షర సత్యమని నిత్యం రుజువు అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంగతి కోసం ఈ సామెతను కాస్త మాఢిఫై చేసుకోవాలి మరి. మద్యంతురాణాం న భయం.. న లజ్జ.. అంటే ఫుల్లుగా మందు తాగినవాడికి భయం, సిగ్గూ రెండూ ఉండవని అర్థం. (మందుబాబులు దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి.. బహిరంగప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని ఉద్దేశించి మాత్రమే ఈ వాక్యాలు అని అర్థం చేసుకోగలరు.) ఈ అప్ డేటెడ్ సామెత నిజమని నిరూపించే ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో లిక్కర్ షాపు వద్ద సిట్టింగ్ రూములు లేవని.. నడిరోడ్డుపైనే సిట్టింగ్ వేశాడో మందుబాబు. ఎంత తాగాడో, ఏం తాగాడో తెలియదు కానీ.. మందుబాటిల్ చేతిలో పట్టుకుని, నడిరోడ్డుపై నానా హంగామా చేషాడు. సిట్టింగ్ రూమ్లు లేవంటూ మందుబాటిల్లో నిరసన తెలిపిన మందుబాబు.. వెంటనే సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేయకపోతే.. మళ్లీ వస్తా, ఫుల్ బాటిల్ ఇదే ప్లేస్లో తాగుతా.. ఎవరు ఏం చేస్తారో చేయండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మనోడి యవ్వారంతో ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఏపీలో సిట్టింగ్ రూమ్లు ఎందుకు లేవు?
సాధారణంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వైన్స్, లిక్కర్ షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి అక్కడే రోడ్ల ముందు, షాపుల ముందు మందు తాగకుండా ఉండేందుకు ఏపీలో గతంలో పర్మిట్ రూమ్లకు అనుమతించారు. పర్మిట్ రూమ్ అంటే మద్యం తాగేందుకు అనువుగా లిక్కర్ షాపు పక్కనే ఉండే ఓ చిన్న గది. అయితే అక్కడ కుర్చీలు, బల్లలు ఉండవు. కేవలం నిలబడి మద్యం తాగేందుకు పర్మి్షన్ ఉంటుంది. అలాగే మందుబాబుల కోసం వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పర్మిట్ రూమ్లతో మద్యం షాపు యజమానులకు అదనంగా ఆదాయం వచ్చేది. అలాగే ప్రభుత్వం కూడా పర్మిట్ రూమ్ అనుమతి కోసం ఐదు లక్షల రూపాయల వరకూ వసూలు చేసేది.
అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ పర్మిట్ రూమ్లు రద్దు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తే లిక్కర్ షాపులు మినీ బార్లుగా మారొచ్చనే అంచనాతో పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇదే ఇప్పుడు తలనొప్పిగా మారుతోంది. పర్మిట్ రూమ్లు లేకపోవటంతో లిక్కర్ షాపుల వద్ద మందు తాగేవారు.. రోడ్లపైనే మందు తాగుతున్న పరిస్థితి. దీంతో మందుబాబుల కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు సమాచారం.
Latest News