![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:06 PM
తెలుగుదేశం ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల ఊబిలోకి నెట్టిందని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మోసాలతో నింపేశారని జగన్ విమర్శించారు. "కాగ్ నివేదికను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, సంక్షేమం ఊసే లేదు. ఈ సంవత్సర కాలంలో పెట్టుబడులు తగ్గాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా బాబు అనుకూల గజదొంగల జేబుల్లోకి వెళ్తోంది" అని ఆరోపించారు. తమ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించామని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించామని అన్నారు.చంద్రబాబును ‘అప్పుల సమ్రాట్’ గా అభివర్ణించిన జగన్.. కేవలం 12 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేశారని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో 13.76 శాతం పెరుగుదల కనిపిస్తే, రాష్ట్ర రెవెన్యూలో కేవలం 3.8 శాతం మాత్రమే వృద్ధి ఉంది. మా ఐదేళ్ల పాలనలో రూ. 3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం 12 నెలల్లోనే రూ. 1,37,546 కోట్ల అప్పు చేశారు. మేము ఐదేళ్లలో చేసిన అప్పును చంద్రబాబు ఏడాదిలోనే చేసి చూపించారు. అప్పులు తేవడంలోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News