![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:31 PM
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకుగాను దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఇళ్లలో దోమల లార్వాను గుర్తించి నాశనం చేయడం కోసం 431 మందిని తాత్కాలికంగా నియమించుకునేందుకు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. ఏటా మాదిరిగానే సీజనల్ కార్మికులను నియమించుకోవడమేననే భావనతో ఇన్చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎంన్ హరేంధిరప్రసాద్ ఆమోదం తెలిపారు. నెలకు రూ.15 వేలు చొప్పున చెల్లిస్తూ...ఐదు నెలలపాటు మాత్రమే వారిని పనిలో కొనసాగిస్తారు. 2018 నుంచి ఇదే మాదిరిగా సీజనల్ కార్మికుల సేవలను జీవీఎంసీ వినియోగించుకుంటోంది. ఏటా దాదాపు అదే సిబ్బంది పనిచేస్తుంటారు. ఎవరైనా అందుబాటులో లేకపోయినా, సీజనల్ కార్మికుడిగా పనిచేసేందుకు ఆసక్తిచూపకపోయినా వారిస్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పనిచే సిన కార్మికులనే తిరిగి విధుల్లోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం కూటమి ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్ల మొప్పు పొందడం కోసం కొత్త ప్రతిపాదనను వారి ముందుపెట్టారు. పాత వారిని తిరిగి తీసుకోకుండా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ప్రతి కార్పొరేటర్కు ఫోన్ చేసి మలేరియా కార్మికుల భర్తీ కోసం మూడు పేర్లు ఇవ్వాలని, వారికే సీజనల్ పోస్టు ఇస్తామని చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి పదేసి పోస్టులు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. దీనివల్ల పాతవారికి అవకాశం లేకుండా పోవడంతోపాటు కొత్తగా తీసుకునేవారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు వీలు కల్పించినట్టవుతుంది. ఇదే అదనుగా కొంతమంది కార్పొరేటర్లు మలేరియా కార్మికుడి పోస్టు ఇప్పిస్తామంటూ ఆశావహుల నుంచి అవకాశం ఉన్నంతమేర వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కొంతమంది కార్పొరేటర్ల మధ్య చర్చ జరిగింది. పాతవారిని తొలగించడం సరికాదని కొందరు అభిప్రాయపడితే, మరికొందరు మాత్రం వైసీపీ పాలకవర్గం ఉన్నప్పుడు వారు డబ్బులు తీసుకునే పోస్టులు ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు మనం కూడా అలా చేయడంలో తప్పేముందని వాదించారు.
Latest News