![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:13 PM
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, మరో పాతిక మందికిపైగా మావోయిస్టుల హత్యను ఫాసిస్టు చర్యగా సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దివాకర్ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ‘ఛత్తీ్సగఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్లో కేంద్ర సాయుధ బలగాల కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 25 మందికిపైగా మృతి చెందినట్లు తెలిసింది. పహల్గామ్ ‘ఉగ్రవాద’ నేరస్థులను శిక్షించలేని పాలకులు ఆదివాసీ, మావోయిస్టుల్ని హత్య చేసి గర్వంగా ప్రకటన ఇవ్వడం ఫాసిస్టు నీతికి నిదర్శనం. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్న సమయంలో ఇలాంటి చర్యకు ఒడిగట్టడం దారుణం. ఆదివాసీలను ఖాళీ చేయించి అటవీ సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆపరేషన్ కగార్ను ఆపాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు విప్లవ జోహార్లు తెలిపారు.
Latest News