బంగారం ధరల్లో ఊహించని మార్పు
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 11:23 PM

బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపారు. దీనితో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 పెరిగి రూ. 98,450కి చేరుకుంది. మంగళవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 10 గ్రాములకు రూ. 96,540 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర బుధవారం రూ. 1,870 పెరిగి రూ. 98,000కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. ఇది మునుపటి రోజు రూ. 96,130 వద్ద ముగిసింది. ఇటీవల అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, సుంకాలు తగ్గించుకోవడం, అలాగే భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ధరలు మరింత తగ్గుతాయని చాలా మంది అంచనా వేశారు. అయితే, ఇప్పుడు మళ్లీ భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పెరుగుదలకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.


ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు (31.10 గ్రాములు) 3300 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది కిందటి రోజు 3230 డాలర్ల వద్ద కదలాడింది. అంటే ఒక్కరోజులోనే ఇంత భారీగా పెరిగిందన్నమాట. దీంతో దేశీయ మార్కెట్లో కూడా ఈ ప్రభావం బుధవారం కనిపించింది. హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు ఒక్కరోజులోనే రూ. 2400 పెరగడంతో తులం రూ. 97,420 కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,200 పెరగడంతో రూ. 89,300 కు చేరింది.


అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గడం: మూడీస్ సంస్థ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. ద్రవ్య లోటు ఆందోళనలు దీనికి కారణం. ఈ తగ్గింపు అమెరికా ఆర్థిక స్థిరత్వంపై దీర్ఘకాలిక అనిశ్చితిని పెంచింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్ళారు. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా ఈ విషయాన్ని తెలియజేశారు.


బలహీనమైన డాలర్: అమెరికా డాలర్ బలహీనపడటం కూడా బంగారం ధరలకు మద్దతు ఇచ్చింది.


భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: ఇజ్రాయెల్, ఇరాన్ అణు సదుపాయాలపై దాడి చేసే అవకాశం ఉందనే నివేదికలు రావడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇది కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ ఈ విషయాన్ని వెల్లడించారు.


అమెరికా ఆర్థిక ఆందోళనలు: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన పన్ను సంస్కరణలపై కీలక ఓటు, సుంకాల విధానాలపై కొనసాగుతున్న అనిశ్చితి పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగిస్తుంది. ఇది అమెరికా డాలర్‌ను బలహీనపరిచి, బంగారం ధరలను పెంచింది.


ఇక బంగారంతో పాటు, వెండి ధరలు కూడా పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర రూ. 1,660 పెరిగి రూ. 99,160కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. గత మార్కెట్ ముగింపులో కిలో వెండి ధర రూ. 97,500 వద్ద ఉంది.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM