|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 07:53 PM
ఏపీలో ఓ ప్రభుత్వ అధికారి బండారం మొత్తం బయటపడింది.. ఆయన అక్రమ ఆస్తుల చిట్టాను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ఇటీవల నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఏపీఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఈఈ రవికాంత్ చౌదరి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించి.. ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రవికాంత్ ఇంట్లో భారీగా బంగారం, విలువైన పత్రాలు బయటపడ్డాయి. ఆయన భార్య హిమబిందు పేరు మీద ఉన్న లాకర్లో భారీగా బంగారాన్ని గుర్తించారు.
ఏసీబీ అధికారులు రవికాంత్ చౌదరి భార్య హిమబిందును వెంటబెట్టుకుని నంద్యాలలోని ఒక బ్యాంకుకు వెళ్లారు. ఆమె పేరు మీద ఉన్న లాకర్ను తెరిచారు.. అందులో ఏకంగా రూ.2.85 కోట్ల విలువ చేసే 41 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆభరణాలలో వజ్రాలతో పొదిగిన హారాలు, మూడు వడ్డాణాలు, 10 జతల కమ్మలు, బంగారం జడ కుచ్చులు, వంకీలు, లాంగ్చైన్స్ వంటివి ఉన్నాయి. రవికాంత్ ఇంటి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
విలువైన బాండ్లు, ఇళ్ల స్థలాలు, కర్నూలులో ఒక అపార్టుమెంట్, నంద్యాలలో రూ.కోటికి పైగా విలువైన ఇంటిని ఏసీబీ అధికారులు గుర్తించారు. రవికాంత్చౌదరి 30 ఏళ్ల కిందట విద్యుత్శాఖలో లైన్మెన్గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్గా, ఏఈగా ప్రమోషన్ దక్కింది. చాలా కాలం పాటు ఒకే ప్రాంతంలో పనిచేశారు.. మూడేళ్ల క్రితం ఏడీఈగా ప్రమోషన్ పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు.. సోదాలు కొనసాగుతున్నాయంటున్నారు.
సాధారణ లైన్మెన్గా ఉద్యోగంలో చేరిన రవికాంత్.. ఇప్పుడు డిప్యూటీ ఈఈ స్థాయికి ఎదిగారు. లంచం కోసం కక్కుర్తిపడి ఇటీవల ఏసీబీకి దొరికిపోయారు.. అప్పుడు ఆరా తీస్తే ఈయన అక్రమాస్తుల చిట్టా బయటపడింది. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆస్తుల చిట్టా మొత్తాన్ని బయటపెట్టింది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.