![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:50 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల భార్గవ్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.సజ్జల భార్గవ్రెడ్డి తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే, భార్గవ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేరని, అందువల్ల కేసును వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సీనియర్ న్యాయవాది వాదనల నిమిత్తం కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో, ఇది ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.గతంలో ఈ కేసు విచారణ చేపట్టాలని సజ్జల భార్గవ్రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
Latest News