|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 07:52 PM
భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచీ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైమానిక దళంలో మహిళలు యుద్ధ విమానాన్నే నడుపుతున్నప్పుడు.. ఈ లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఈ పోస్టులకు స్త్రీ, పురుష నిష్పత్తి వర్తించదని నిబంధన ఉన్నప్పటికీ.. కేంద్రం ఎందుకు వారిని తీసుకోలేదని న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం అడిగింది.
భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులకు మంచి ర్యాంకులు వచ్చాయి. వరుసగా వీరిద్దరూ 4, 5 ర్యాంకులు సాధించారు. అయితే ఇంత మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ అధికారులు వీరిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థుల కంటే కూడా తమకు ఎక్కువగా మార్కులు వచ్చాయని.. అయినప్పటికీ మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వీరి పిటిషన్పై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా పలు ప్రశ్నలు అడిగింది. భారత వైమానిక దళంలో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచీల్లో వారిని తీసుకోవడానికి సమస్య ఏంటని ప్రశ్నించింది. ముఖ్యంగా స్త్రీ, పురుష నిష్పత్తిపై ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ.. పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో కష్టం ఏముందని అడిగింది.
స్త్రీ పురుషు బేధంతో సంబంధం లేకుండా అవి తటస్థ పోస్టులు అని కేంద్రం ప్రకటించనప్పుడు.. మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులను కేటాయించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్త్రీ పురుషు సమాననత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు మాత్రమే కల్పించడం కాదని చెప్పింది. అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా అర్హత ఉంటే అవకాశం ఇవ్వడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.