భారత్‌కు మద్దతుగా పాకిస్థాన్ టీవీ ఛానల్‌లో చర్చ.. వీడియో వైరల్
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 07:51 PM

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. పహల్గామ్‌లో హిందువులను వారి మతం అడిగి, కాల్చి చంపిన తీరుపై భారత్ కోపంగా ఉండటం సహజమేనని చాలా మంది అభిప్రాయపడ్డారు. భారత్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవన్నీ మనకు సాధారణంగానే అనిపించవచ్చు. అయితే, పాకిస్థాన్‌లోనూ కొంత మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారా..? వైరల్ అవుతున్న ఓ టీవీ ఛానెల్ వీడియో క్లిప్ ఒకటి భారతీయులకు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోలో పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా యాంకర్, ఒక రాజకీయ విశ్లేషకుడు.. భారత్‌లోని హిందువుల పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.


పాకిస్తానీ యాంకర్ అర్జూ కాజ్మీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)కు చెందిన రాజకీయ విశ్లేషకుడు అంజాద్ అయూబ్ మీర్జా ఈ చర్చలో పాల్గొన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల నరమేధంపై మీర్జా విరుచుకుపడ్డాడు. ఇదే సమయంలో భారత్‌లో హిందువుల మనస్తత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే దాడి వేరే వర్గంపై జరిగితే ప్రపంచం మొత్తం స్పందించేదని ఆయన అన్నారు. హిందువులు మేల్కోవాలని సూచించారు. భారత్‌లో సెక్యులర్ విధానాల వల్లే హిందువుల్లో ఐక్యత లేకుండాపోయిందని చెప్పుకొచ్చారు.


పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి హత్య చేయడం గురించి మీర్జా మాట్లాడుతూ.. ‘ఇలాంటిది ఏదైనా వేరే వర్గం వాళ్లకు జరిగి ఉంటే.. అది కూడా హిందువులు చేసి ఉంటే.. ప్రపంచంలోని మీడియా మొత్తం లేచి పెద్ద అన్యాయం జరిగిపోయింది, ఇలా చంపేశారు అని గగ్గోలు పెట్టేది. ఇంతమంది హిందువులను వారి మతం అడిగి మరీ చంపేశారు. ముందుగా.. హిందువుల్లో ఐక్యత ఉండాలి. అది లేదు. నేను మొదటిసారిగా చూస్తున్నాను.. హిందువు మేల్కొన్నాడు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించాడు.


ప్రోగ్రామ్ యాంకర్ అర్జూ కాజ్మీ కల్పించుకుంటూ.. ‘సెక్యులర్, సెక్యులర్ అని చెప్పుకొనే.. హిందువులు తమ పరిస్థితిని ఇలా చేసుకున్నారు’ అని పేర్కొంది. దీనికి మీర్జా స్పందిస్తూ ‘సెక్యులర్, సెక్యులర్ అని హిందువులను గోడకు కట్టేశారు’ అని అన్నాడు. యాంకర్ అర్జూ కొనసాగిస్తూ.. ‘ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉండొచ్చు.. ఇన్ని క్రిస్టియన్ దేశాల ఉండొచ్చు. మరి హిందూ దేశం ఎందుకు ఉండకూడదు..? నాకు అర్థం కాదు. నేను ఇవన్నీ మాట్లాడితే పాకిస్తాన్‌లో నన్ను తిడతారు’ అని పేర్కొంది.


ఎక్స్ (ట్విట్టర్)లో అతుల్ శర్మ అనే యూజర్ ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘భారత మీడియాలో చెప్పాల్సిన విషయాన్ని పాకిస్తాన్ టీవీ ఛానెళ్లలో చెబుతున్నారు. కొన్నిసార్లు శత్రువు కూడా తెలిసీ, తెలియక ఉపయోగకరమైన విషయాలు చెబుతాడు. ప్రతి హిందువూ ఇది వినాలి’ అని పేర్కొన్నారు.


పాకిస్థాన్ సైన్యమే దీనికి కారణం..


మీర్జా ప్రస్తుతం స్కాట్లాండ్‌లో ఉంటున్నారు. పహల్గామ్ దాడి జరిగిన మరుసటి రోజే ఆయన స్పందించారు. న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడుతూ.. ఇది నేరుగా భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి అని పేర్కొన్నారు. ఈ దాడికి పాకిస్తాన్ సైన్యం, దాని చీఫ్ అసీమ్ మునీర్‌లే కారణమని మండిపడ్డారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద వ్యవస్థ చాలా లోతుగా ఉండటం వల్లే ఇదంతా జరుగుతోందని కూడా చెప్పారు.


‘పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మేము ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నాం. పాకిస్తాన్ సైన్యమే దీనికి కారణం. ఈ ఉగ్రదాడికి జనరల్ అసీమ్ మునీరే బాధ్యుడు. TRF గురించి అందరికీ తెలుసు. ఇది లష్కర్-ఎ-తొయిబా ప్రారంభ సంస్థ. లష్కర్-ఎ-తొయిబా అనేది పాకిస్తాన్ సైన్యం, ISI మెదడులో నుంచి పుట్టిందే’ అని మీర్జా అన్నారు.


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మన భద్రతా దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్.. భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, మిసైళ్ల దాడికి ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ వాటిని సరిహద్దుల్లోనే కూల్చివేసింది. పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చింది. పాకిస్థాన్ క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దిక్కుతోచని స్థితిలో పాకిస్థా్న్.. కాల్పుల విరమణ రాగం అందుకుంది.


పాకిస్తాన్‌లోనూ కొంత మంది.. పహల్గామ్ ఘటనను తప్పుబట్టడం గమనార్హం. హిందువులను మతం పేరుతో చంపడంపై భారత్ ఆగ్రహం సహజమని అంటున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైఫల్యంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇది వారిలో వచ్చిన మార్పునకు నిదర్శనమని, వారి లౌకికవాద ప్రయత్నాల వల్ల ఇది జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News
Maha Cabinet clears Karmayogi 2.0 and Sarpanch Samvad Wed, Dec 24, 2025, 04:33 PM
New monoclonal antibody safe and effective for rare liver disease Wed, Dec 24, 2025, 04:22 PM
Russia: Two police personnel killed in Moscow explosion Wed, Dec 24, 2025, 04:21 PM
BMC polls: Thackeray cousins' emotional appeal set to clash with BJP's organisational might Wed, Dec 24, 2025, 04:19 PM
Sensex, Nifty end lower ahead of Christmas Wed, Dec 24, 2025, 04:15 PM