ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఆ గ్రూప్ నుంచి బయటికి వచ్చాను

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 08:26 PM

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, తన తాజా చిత్రం 'కన్నప్ప' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ నటీనటులు సభ్యులుగా ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎందుకు బయటకు వచ్చేశానో వివరించారు. ఈ గ్రూప్‌లో రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ (బన్నీ), రామ్ చరణ్ వంటి పలువురు అగ్ర నటులు ఉన్నట్లు ఆయన తెలిపారు."టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు?" అన్న ప్రశ్నకు విష్ణు బదులిస్తూ... "ఆ వాట్సాప్ గ్రూప్‌ను రానా, బన్నీలు ప్రారంభించారు. నేను కూడా ఒకప్పుడు అందులో సభ్యుడిగా ఉండేవాడిని. అయితే, ఆ గ్రూప్‌లో చాలా మంది హీరోయిన్లు కూడా ఉన్నారు. దీంతో నాకు అక్కడ అందరితో కలిసి చాట్ చేయాలంటే కొంత బిడియంగా, మొహమాటంగా అనిపించేది. అందుకే ఆ గ్రూప్ నుంచి నిష్క్రమించాను" అని స్పష్టం చేశారు. అయితే, ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని రానా, బన్నీలకు చెప్పినట్లు విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో తోటి నటీనటులతో తనకున్న అనుబంధం గురించి విష్ణు మాట్లాడుతూ... "మేమంతా – నేను, రానా, బన్నీ, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. మా మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్‌తో ఒకరికొకరం అండగా నిలబడతాం. మా మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్‌షిప్‌ ఉంది. ఇలా కలిసికట్టుగా ఉండటం అనేది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన గొప్ప విషయాల్లో ఒకటి. ఆ సంప్రదాయాన్ని మేమిప్పటికీ కొనసాగిస్తున్నాం" అని వివరించారు.గతంలో నటుడు నాని కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి వాట్సాప్ గ్రూప్ గురించి ప్రస్తావించిన విషయం విదితమే. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 140 మందికి పైగా నటీనటులు సభ్యులుగా ఉన్న ఒక గ్రూప్ ఉందని, అందులో సినిమా ట్రైలర్లు, ఇతర అప్‌డేట్‌లు పంచుకుంటూ ఉంటారని నాని అప్పట్లో తెలిపారు. ఆ గ్రూప్ ఒకప్పుడు చాలా చురుగ్గా ఉండేదని కూడా ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa