ఆమె నటించిన తొలి సినిమా ఇంకా విడుదల కానేలేదు కానీ.. ఆమెను తమ తమ సినిమాల్లో నటింపజేసుకోవడానికి దర్శక, నిర్మాతలు పోటీలు పడుతున్నారు. ఈ నేపథ్యం ఎవరి గురించినో వేరే చెప్పనక్కర్లేదు. ఇదంతా జాన్వీ కపూర్ గురించి. అందాల తార శ్రీదేవి తనయ గురించి. జాన్వీ కపూర్ సినీ ఎంట్రీ గురించి చాలా మంది చాన్నాళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ.. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ. హిట్టైన మరాఠా సినిమా ‘సైరత్’కు రీమేక్ గా ఇది రూపొందుతోంది.
పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆసక్తితో ఎదురుచూస్తోంది. శ్రీదేవి తనయ తెరపై ఎలా కనిపిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆ సినిమా విడుదల కాకున్నా, జాన్వీకి మాత్రం తదుపరి సినిమా ఆఫర్లు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఆమెను తమ సినిమాల్లో నటింపజేసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.వారిలో ముందు నిలుస్తున్నాడు.. జాన్వీని ఇంట్రడ్యూస్ చేస్తున్న నిర్మాత కరణ్ జొహర్. ‘దఢక్’ నిర్మాత అయిన కరన్ బాలీవుడ్ లో ‘టెంపర్’ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ వెర్షన్లో రణ్ వీర్ హీరోగా కనిపిస్తున్నాడు. ‘సింబా’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. తెలుగులో కాజల్ చేసిన హీరోయిన్ పాత్రను జాన్వీ చేత చేయించాలని కరణ్ అనుకుంటున్నాడట. ఈ మేరకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం.
అలాగే పలువురు బాలీవుడ్ మూవీ మేకర్లు కూడా జాన్వీని తమ తమ సినిమాల్లో నటింపజేయడానికి శ్రీదేవి, బోనీ కపూర్లను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో కొందరు తమిళ, తెలుగు మూవీ మేకర్లు కూడా ఉన్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa