ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెరపైకి 'వేల్పారి' సినిమాపై ఆసక్తికరమైన ప్రచారం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 04:56 PM

దర్శకుడు శంకర్ కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'వేల్పారి' సినిమాపై మరోసారి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని ఇద్దరు హీరోల కథగా మార్చి, అందులో ప్రధాన పాత్రల కోసం కోలీవుడ్ స్టార్ విక్రమ్, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌లను తీసుకోవాలని శంకర్ ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మీడియా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్, పూర్తి చేయడానికి పట్టే సమయం వంటి వివరాలను శంకర్‌ను ఆ సంస్థ అడిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఊహాగానాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ తమిళ రచయిత సు. వెంకటేశన్ రాసిన 'వీర యుగ నాయగన్ వేల్పారి' అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.వేల్పారి తమిళనాట గొప్ప దాతృత్వం, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన రాజు. ఎండిపోతున్న ఒక మల్లెతీగకు తన రథాన్నే పందిరిగా ఇచ్చిన గొప్పదనం ఆయనది. అందుకే 'ముల్లైక్కు తేర్ కొడుత్తాన్ పారి' (మల్లెతీగ కోసం రథాన్ని ఇచ్చిన పారి) అనే సామెత తమిళనాట ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. తమిళ సాహిత్యంలో పేర్కొన్న ఏడుగురు గొప్ప దాతలలో వేల్పారి ఒకరు.గతంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన శంకర్, లాక్‌డౌన్ సమయంలో 'వేల్పారి' పుస్తకం కోసం ప్రయత్నించినా దొరకలేదని, రచయిత సు. వెంకటేశన్ తన సొంత కాపీని చదవడానికి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. 2000 ఏళ్ల నాటి రాజు గురించి అంత గొప్పగా రాసిన ఆ నవల తనను ఎంతగానో ఆకట్టుకుందని శంకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa