ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని సేవాభావం, అంకితభావం మరియు త్యాగంతో కూడిన ప్రస్థానంగా అభివర్ణిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'X' (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపిన షా.. మోదీ దీర్ఘాయుష్షుతో ఉండాలని, ఆయన నాయకత్వంలో 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన నెల రోజుల 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా రెండు భారీ జంట బైక్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని జన్మస్థలమైన గుజరాత్లోని వద్నగర్ నుంచి వారణాసి వరకు సాగే యాత్రను ఉదయం 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్నగర్లో ప్రారంభించనున్నారు. అదే సమయంలో 'వారణాసి నుండి వద్నగర్' యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ఈ రెండు యాత్రలు 10 రాష్ట్రాల్లోని 193 జిల్లాలు, 1,159 గ్రామాల మీదుగా దాదాపు 40,000 కిలోమీటర్ల మేర సాగనున్నాయి. ఇందులో సుమారు 1,000 మంది యువకులు పాల్గొననున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయ్యే అక్టోబర్ 7న ఈ యాత్రలు ముగుస్తాయి. వద్నగర్లో షర్మిష్ఠ సరస్సు వద్ద 'మహారతి', హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద 'స్వచ్ఛతా కార్యక్రమం'లో కూడా అమిత్ షా పాల్గొననున్నారు.