సవరణ నిబంధనలు 2026 నోటిఫై
న్యూఢిల్లీ: డిజిటల్ మార్కెట్ప్లేస్లలో వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడం మరియు పారదర్శకతను పెంచడం లక్ష్యంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 'వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) (సవరణ) నిబంధనలు, 2026'ను నోటిఫై చేసింది. ఆన్లైన్ షాపింగ్లో తప్పుదోవ పట్టించే విధానాలు, డార్క్ ప్యాటర్న్లను అరికట్టడంతో పాటు వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరియు వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత కాపాడేందుకు ఈ నిబంధనలను నవీకరించారు. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుండి అమలులోకి రానున్నాయి.
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ ఇ-కామర్స్ సంస్థ జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (NCH) వ్యవస్థతో తప్పనిసరిగా అనుసంధానం కావాల్సి ఉంటుంది. 2025లో ఎన్సిహెచ్కు వచ్చిన 17.71 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో దాదాపు 29 శాతం (5.11 లక్షలు) ఇ-కామర్స్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. అలాగే, ఆన్లైన్ శోధన ఫలితాలను తారుమారు చేయడం నిషేధించబడింది. ప్రమోషనల్ స్పాన్సర్డ్ లిస్టింగ్లను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు, ఏదైనా వస్తువుపై తగ్గింపు ధర ప్రకటించినప్పుడు దానికి ముందు 30 రోజుల్లో ఉన్న అత్యల్ప ధరను (మునుపటి ధర) మరియు సవరించిన ధరను తప్పనిసరిగా ప్రదర్శించాలి.
వినియోగదారులను మభ్యపెట్టే 'డార్క్ ప్యాటర్న్ల' నివారణకు ప్రతీ ఇ-కామర్స్ ಸಂಸ್ಥే ఏటా స్వీయ-ఆడిట్ నిర్వహించి, అనుగుణ్యత ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మార్కెట్ప్లేస్ సంస్థలు ఉత్పత్తుల 'బెస్ట్-బిఫోర్' తేదీలు, వారంటీ, రిటర్న్-రీఫండ్ విధానాలు, దిగుమతిదారు వివరాలు మరియు మూల దేశం (Country of Origin) వంటి సమాచారాన్ని విధిగా వెల్లడించాలి. వినియోగదారుల స్పష్టమైన పూర్వానుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడంపై మరియు అనవసరపు బండిల్డ్ రుసుములు విధించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.