న్యూఢిల్లీ: నగర పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించడం మరియు జాతీయ రాజధానిలో పచ్చదనాన్ని విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సెంట్రల్ ఢిల్లీలోని లోధి కాలనీ పార్కులో ‘భారత్ వన్’ హరిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజును పురస్కరించుకుని, న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, స్థానిక పర్యావరణానికి అనువైన దేశీయ మొక్కలను నాటడం ద్వారా సెంట్రల్ ఢిల్లీ నడిబొడ్డున దట్టమైన పచ్చని అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదేశం నగర నివాసితులకు వాకింగ్, ధ్యానం మరియు యోగా చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
‘వికసిత్ భారత్ సంకల్ప్’ ఫ్రేమ్వర్క్ కింద రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఎన్డీఎంసీ బృందంతో పాటు పాఠశాల విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని ఎన్డీఎంసీ వైస్ చైర్పర్సన్ కుల్జీత్ సింగ్ చాహల్ వెల్లడించారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో 10,000కు పైగా మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. అలాగే, ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది కలిసి చెట్లు నాటి వాటిని సంరక్షిస్తారని, ఇది పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన వివరించారు.