అంతర్జాతీయం
సౌదీ రాజధానిపై హౌతీల బాలిస్టిక్ క్షిపణి దాడి యత్నం.. అడ్డుకున్నట్లు ధృవీకరించిన రక్షణ దళాలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్ను లక్ష్యంగా చేసుకుని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. శనివారం తెల్లవారుజామున ఈ దాడి యత్నం జరిగిందని, ఆకాశంలోనే క్షిపణిని కూల్చివేయడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అధికారికంగా ధృవీకరించాయి. రియాద్ నగరవాసులు భారీ పేలుడు శబ్దం విన్నారని, విమానాశ్రయం సమీపంలో పొగలు కమ్ముకోవడం కనిపించిందని అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. తాజా ఉద్రిక్తతలు మొదలైన తర్వాత రియాద్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఇదే మొదటిసారి కావడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.రాజధాని రియాద్తో పాటు ఎర్రసముద్ర తీరంలోని కీలక నౌకాశ్రయ నగరం యాన్బుతో పాటు తైఫ్, బైష్, ఫరాసన్ ప్రాంతాలలోని పౌర మౌలిక సదుపాయాలపై కూడా హౌతీలు దాడులకు ప్రయత్నించారని, అయితే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని సంకీర్ణ దళాలు తెలిపాయి. మరోవైపు రియాద్లోని కీలక స్థావరాలతో పాటు యాన్బులోని ప్రముఖ చమురు దిగ్గజ సంస్థ అరామ్కో కేంద్రాలపై క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్ల ద్వారా తామే దాడులు చేశామని హౌతీల సైనిక ప్రతినిధి ప్రకటించారు. అయితే ఈ దాడులకు సంబంధించి అరామ్కో సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ప్రాంతీయంగా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తుండటంతో గత కొద్ది రోజులుగా వరుస దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతకుముందు నిరోధించిన ఒక డ్రోన్ శిథిలాలు పడి ఒక పౌరుడు మరణించగా, ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాను లక్ష్యంగా చేసుకుని వచ్చిన మరో డ్రోన్ను సైతం గగనతలంలోనే కూల్చివేసినట్లు సౌదీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం యెమెన్ ప్రభుత్వ దళాలకు మరియు హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య అంతర్యుద్ధం మళ్లీ ఉధృతం కావడం, కీలకమైన సముద్ర రవాణా మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి పరిసరాల్లో ఘర్షణలు చెలరేగడం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.