దాడులకు తామే బాధ్యులమని ప్రకటించిన హౌతీలు
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో శనివారం దట్టమైన పొగ, మంటలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. రాజధానిలోని పలు సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుిత హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
రాయిటర్స్ సమాచారం ప్రకారం.. విమానాశ్రయ రహదారి, ప్రధాన టెర్మినల్ భవన సముదాయాల సమీపంలోని ఇంధన ట్యాంకులుగా కనిపిస్తున్న ప్రాంతం నుండి భారీ ఎత్తున నల్లటి పొగ, మంటలు పైకి లేచాయి. యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడికి నిరసనగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీలు తెలిపారు. రియాద్తో పాటు ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు నగరంలో ఉన్న అరామ్కో చమురు సదుపాయంపై కూడా దాడులు చేసినట్లు వారు పేర్కొన్నారు.
హౌతీల ప్రకటనపై సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి స్పందిస్తూ.. శనివారం తెల్లవారుజామున రియాద్ వైపు వచ్చిన ఒక క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేశాయని తెలిపింది. దీనితో పాటు బిష్, ఫరాసన్, తైఫ్, యాన్బు నగరాలలో పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులను కూడా భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా సౌదీ పౌర రక్షణ విభాగం రియాద్, అల్-ఖర్జ్ నగరాల ప్రజలకు వైమానిక దాడుల ప్రమాదం ఉందంటూ ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపింది. శనివారం ఉదయం పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రమాదం తొలగిపోయినట్లు ప్రకటించింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడికి ప్రయాణాలు చేయడంపై పునరాలోచించుకోవాలని సూచించింది. మరోవైపు, పౌరులు మరియు ఇంధన మౌలిక సదుపాయాలపై హౌతీలు జరుపుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది.
సౌదీపై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్, సౌదీలతో ఉన్న త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కింద సైనిక, సాంకేతిక సాయం అందించడానికి టర్కీ సిద్ధంగా ఉందని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఇదే సమయంలో, సౌదీ-హౌతీల మధ్య పోరాటం ముగిసి శాంతి నెలకొనాలని ఇరాన్ కోరుకుంటోందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ వ్యాఖ్యానించారు. అమెరికాతో చర్చల పునరుద్ధరణకు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ తమ షరతులను పంపినట్లు ఆయన తెలిపారు.