మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను ఆపాలి
వీధిదీపాల టెండర్లను రద్దు చేయాలి
మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
హైకోర్టు తీర్పును అమలు చేయాలి: సీఐటీయూ
అనంతపురం, సెప్టెంబర్ 18:
మున్సిపల్ సేవలను ప్రైవేటీకరించే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలని, వీధిదీపాల నిర్వహణకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం అనంతపురం నగరపాలక సంస్థ ఆవరణలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు మున్సిపల్ ఇంజనీరింగ్ నగర కార్యదర్శి మురళి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సీఐటీయూ నగర కార్యదర్శి ముత్తుజ, మున్సిపల్ ఇంజనీరింగ్ నగర గౌరవ అధ్యక్షులు గోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 14 రకాల మున్సిపల్ సేవలను ప్రైవేటీకరించేందుకు 673, 975 జీవోలు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే వీధిదీపాల నిర్వహణను ప్రైవేటీకరణలో భాగంగా టెండర్లు పిలుస్తున్నారని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, మున్సిపల్ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ప్రజలకు అందే సేవల నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, మున్సిపాలిటీలు తమ బాధ్యతల నుంచి తప్పుకోకుండా ప్రజలకు నేరుగా నాణ్యమైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలనే న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
ప్రైవేటీకరణపై చూపుతున్న శ్రద్ధను కార్మికుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం చూపాలని, మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని, వీధిదీపాల టెండర్లను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం మున్సిపల్ కార్యదర్శి ఖయ్యుం గారికి వినతి పత్రం ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ సెక్షన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున, సంజీవరాయుడు, నగర కార్యదర్శి ఓబుళపతి, పారిశుద్ధ్య విభాగం నగర కార్యదర్శి తిరుమలేశు, కోశాధికారి లక్ష్మీనరసమ్మ, ఉపాధ్యక్షులు బండారి ఎర్రిస్వామి, శివన్న, లోక్నాథ్ చౌదరి, గౌరీ, విజయ్, నాగేంద్ర, నారాయణ, కిరణ్, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.