*మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి*
*కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ సమీక్ష.. సమావేశంలో పాల్గొన్న చైర్మెన్ నసీర్ అహ్మద్ గారు, కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు*
జిల్లాలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రిజర్వేషన్ల అమలు తీరును సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, వక్ఫ్ బోర్డు సీఈవో యాకుబ్ భాష గారు, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గారు, జిల్లా ఎస్పీ పి. జగదీష్ గారితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొని మైనారిటీలకు అందుతున్న సంక్షేమ సేవలు, రిజర్వేషన్ల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కమిటీకి వివరాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో మైనారిటీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా మరియు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, రిజర్వేషన్ల అమలు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి మైనారిటీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిటీ సూచించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో మైనారిటీ యువతకు మరిన్ని అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల అమలులో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సూచించారు. మైనారిటీ విద్యార్థులకు విద్యాపరంగా అవసరమైన సహకారం అందించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. మైనారిటీల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకోవడమే కమిటీ పర్యటన ప్రధాన ఉద్దేశమని చైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తమ శాఖల పరిధిలో మైనారిటీల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరాలను కమిటీకి అందజేశారు.