ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెనిజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ఆమె దేశం నుంచి అనూహ్యమైన హెచ్చరిక ఎదురైంది. బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనిజువెలా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ తెలిపారు. డిసెంబర్ 10వ తేదీన నార్వే రాజధాని ఓస్లోలో జరగనున్న పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాలని మచాడో గతంలో ఆసక్తి చూపిన నేపథ్యంలో.. ఈ సంచలన హెచ్చరిక వచ్చింది.
అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోపై వెనిజువెలా ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మరియా దేశంలో లేరని, ఇప్పటికే ఆమెపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం చేశారు.
నార్వేజియన్ నోబెల్ కమిటీ.. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం వల్లే ఆమెకు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు తెలిపింది. దాదాపు గత ఏడాది కాలంగా.. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, ఆమె వెనిజులాలోనే అజ్ఞాతంలో ఉండి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూనే కమిటీ ఆమెను 'శాంతి ఛాంపియన్'గా అభివర్ణించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికాలో ప్రజల ధైర్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పింది.
స్వీడన్కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఆ రోజు జరిగే వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు 10 లక్షల డాలర్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు) అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa