ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాదం ఒక హృదయ విదారక ఘటన. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక బైక్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రైవేట్ బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులలో కనీసం 19 మంది సజీవ దహనమై, ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. బైక్ ఢీకొన్న వెంటనే మంటలు బస్సు ముందు భాగంలో మొదలై క్షణాల్లోనే వ్యాపించడంతో, ప్రయాణికులు తేరుకునేలోపే ఈ పెను విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘోర ప్రమాదంలో అంతా అయిపోయిందనుకున్న సమయంలో, ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు చేసిన సాయం మరింత ప్రాణనష్టం జరగకుండా అడ్డుకుంది. వారిలో ఒక మహిళ అప్పటికప్పుడు కర్నూలు ఎస్పీకి నేరుగా సమాచారం అందించి, వెంటనే అగ్నిమాపక, సహాయక చర్యలు మొదలయ్యేలా చేసింది. ఈ తక్షణ స్పందన వల్ల బస్సు దగ్ధమవుతున్నా, మిగిలిన వారిని కాపాడేందుకు పోలీసు, అంబులెన్స్ బృందాలు సకాలంలో చేరుకోగలిగాయి.
సమాచారం అందించిన మహిళే కాక, మరో వ్యక్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో నుంచి బయటపడిన కొద్దిమంది గాయాలతో బాధపడుతుండగా, అంబులెన్స్ వచ్చే వరకు ఎదురుచూడకుండా.. ఆ వ్యక్తి వెంటనే వారిని తన సొంత వాహనంలోనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ సమయస్ఫూర్తితో కూడిన చర్య, వేగంగా వారికి వైద్య సహాయం అందేలా చేసి, గాయపడిన వారి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది.
బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, ఈ విషాద సమయంలోనూ మానవత్వం ఇంకా బతికే ఉందని ఆ ఇద్దరు వ్యక్తులు తమ చర్యల ద్వారా నిరూపించారు. ఒకరు వేగంగా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే, మరొకరు గాయపడినవారిని ఆస్పత్రికి చేర్చడానికి ఆలస్యం చేయకుండా సహాయం అందించారు. వారి త్యాగం, తక్షణ స్పందన మరింత ప్రాణనష్టం జరగకుండా అడ్డుకుని, ఆపదలో ఆదుకోవాలన్న స్ఫూర్తిని రగిలించాయి. ఈ దైవదూతల ధైర్యసాహసాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa