ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో ఓలా ఇంజినీర్ ఆత్మహత్య.. ఆ సంస్థ సీఈఓపై కేసు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 09:58 PM

బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్స్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. బలవస్మరణానికి పాల్పడిన 38 ఏళ్ల అరవింద్ అనే ఇంజినీర్.. 28 పేజీల సూసైడ్‌ నోట్‌లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సహా తన పై ఉద్యోగులు మానసిక వేధింపులకు గురిచేసి, ఆర్థికంగా దోపిడీ చేశారని ఆరోపించారు. అయితే, అరవింద్ వేధింపులు లేదా ఉద్యోగ సంబంధిత ఇబ్బందుల గురించి ఏనాడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఓలా సంస్థ ఓ ప్రకనట విడుదల చేయడం గమనార్హం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు అరవింద్ 2022 నుంచి ఓలాలో హోమోలొగేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 28న బెంగళూరులోని చిక్కళసంద్రలోని తన నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన అతడి స్నేహితులు.. చికిత్స కోసం మహారాజా అగ్రసేన హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ రోజునే అరవింద్ మృతిచెందాడు.


ఈ ఘటనపై పోలీసులకు అసహజ మరణంగా కేసు నమోదుచేశారు. అయితే, అరవింద్ రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌ను అతడి సోదరుడు గుర్తించాడు. ఇందులో ఆఫీసులో సుపీరియర్ల సుబ్రాత్ కుమార్ దాస్, భవిష్ అగర్వాల్‌లువేధింపులు, ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. మానసికంగా వేధించడమే కాదు, జీతం, అలవెన్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించాడు.


అరవింద్ సోదరుడి ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత నెఫ్ట్ ద్వారా తన తమ్ముడి బ్యాంకు ఖాతా నుంచి రూ.17.46 లక్షలు బదిలీ అయ్యాయి. దీనిపై స్పష్టత కోసం ఓలా సంస్థను సంప్రదించగా సుబ్రాత్ కుమార్ దురుసగా స్పందించాడు. తర్వాత కంపెనీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు కార్తేష్ దేశాయ్, పరమేశ్, రోషన్లు అరవింద్ నివాసానికి వచ్చారు కానీ, ఆ నగదు బదిలీ గురించి సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఓలా సంస్థ వైఖరిపై అరవింద్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు.


అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, సుభ్రాత్ కుమార్ దాస్ సహా పలువురిపై అక్టోబరు 6న కేసు నమోదయ్యింది. అరవింద్ మరణానికి ఉన్నతాధికారుల నిరంతర వేధింపులు, అవమానాలు, ఆర్థిక దోపిడీ ప్రత్యక్ష కారణమని ఎఫ్ఆర్ఐ‌లో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం అభ్యర్ధించింది.


అటు, అరవింద్ మృతిపై ఓ ప్రకటన విడుదల చేసిన ఓలా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని, గత మూడున్నరేళ్లుగా తమ సంస్థలో పనిచేస్తోన్న అరవింద్ ఎప్పుడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. విధుల్లో భాగంగా కంపెనీ యాజమాన్యంతో అతడికి ప్రత్యక్షంగా ఎలాంటి ఇంటరాక్షన్ లేదని తెలిపింది. తమపై నమోదైన కేసు న్యాయపరంగా ఎదుర్కొంటామని, కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa