దేశీయ టెక్ దిగ్గజం, టాటా గ్రూప్ దిగ్గజ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగుల తొలగింపులను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లేఆఫ్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఒక్కసారిగా భారీగా ఉద్యోగులను తొలగించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీసీఎస్ ప్రకటించిన లేఆఫ్స్ కారణంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని యూనియన్ ఆరోపిస్తోంది. అయితే ఈ విషయంపై టీసీఎస్ తాజాగా స్పందించింది. లేఆఫ్స్ పై వివరణ ఇచ్చింది.
12 వేల ఐటీ ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నైలో యూనైట్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు మంగళవారం రోజు ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి టీసీఎస్కు వ్యతిరేకగా నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీసీఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టీసీఎస్ కంపెనీ సీనియర్, మేనేజర్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆరోపించింది. ఈ లేఆఫ్స్ ద్వారా సుమారు 30- 40 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు యునైట్ సభ్యురాలు జనని. మాస్ లేఆఫ్స్పై ఆవేదన వ్యక్తం చేశారు.
అనుభవజ్ఞుల స్థానంలో ఫ్రెషర్లను 80- 85 శాతం తక్కువ వేతనాలు ఇచ్చి నియమించుకుంటోందని ఉద్యోగుల యూనియన్ యునైట్ ఆరోపించింది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి నైపుణ్యాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. రూ. 2.55 లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఒక పెద్ద సంస్థ లాభార్జన కోసం ఇలా ఉద్యోగులను తొలగించడం అనేది అన్యాయమైన చర్యగా యునైట్ పేర్కొంది.
ఐటీ ఉద్యోగుల యూనియన్ చేసిన ఆరోపణలపై టీసీఎస్ సంస్థ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 30 వేల ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోణలను ఖండించింది. ఆ ఊహాగానాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ముందుగా చెప్పినట్లుగానే తమ సంస్థలోని ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం అంటే సుమారు 12 వేల మంది వరకే తొలగిస్తామని స్పష్టం చేసింది. యూనియన్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఊహాగానాలను నమ్మవద్దని తెలిపింది. అయితే, దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్లోనే భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు ప్రకటించడం దేశీయ ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర కంపెనీలు సైతం మాస్ లేఆఫ్స్ వైపు మొగ్గు చూపవచ్చని, ఇది ఉద్యోగుల్లో ఒత్తిడిని, ఆందోళనలు పెంచవచ్చంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa