ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను,,,దత్తత తీసుకొన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:10 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం.. పబ్లిక్, పీపుల్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ (P4 విధానం) అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పీ4 విధానంలో భాగంగా టాప్ పది శాతం సంపన్న వర్గాలు.. అట్టడుగున ఉన్న 20 శాతం నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని అండగా నిలవాల్సి ఉంటుంది. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు అని.. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పిలుస్తారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.తనతో పాటు తన కుటుంబం కూడా ఇందులో భాగస్వాములు అవుతారని తెలిపారు.


జీరో పావర్టీ-పీ4 విధానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందన్న సీఎం చంద్రబాబు.. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా పీ4 కార్యక్రమంలో మమేకం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు కార్పొరేట్‌ సంస్థలను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. పీ4 విధానంలో భాగంగా ఓ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని.. ఆ ప్రాంతానికే చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తు దత్తత తీసుకునేలా చూడాలన్నారు. బంగారు కుటుంబాల కోసం చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని చంద్రబాబుు ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు.


మరోవైపు ఉగాది నుంచి పీ4 విధానం అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకూ 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. 57,503 మంది మార్గదర్శులుగా పీ4 కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటే సుమారుగా మరో 2 లక్షల మంది మార్గదర్శులు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. పీ4 విధానంలో భాగంగా పల్నాడు జిల్లాలో ఎక్కువ బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ విషయంలో విశాఖపట్నం జిల్లా చివరలో ఉంది.


మరోవైపు పీ4 కార్యక్రమం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా #IAmMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa