మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే భాస్కర్రెడ్డికి గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. తాజాగా గన్మెన్ గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్రెడ్డిని విచారణకు పిలిచి సిట్ అధికారులు తీవ్ర స్థాయిలో భౌతికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఆయనను చిత్రహింసలు పెట్టడంతో ఆసుపత్రిపాలై చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నామని అన్నారు. లిక్కర్ స్కామ్ తో చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సంబంధం ఉన్నట్లుగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అడిగితే, ఇలాంటి అబద్దపు స్టేట్మెంట్ తాను ఇవ్వనని నిరాకరించడమే హెడ్ కానిస్టేబుల్ చేసిన తప్పా? ఇంత దారుణంగా చిత్రహింసలు పాలు చేసి, చివరికి అతడికి హాని కలిగించేలా సిట్ అధికారులు వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే హైకోర్ట్లో బాధితుడు పిటీషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ సదరు హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని, ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుని, వైయస్ఆర్సీపీ నేతలను తప్పుడు కేసుల్లో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి నేతలు గ్రహించాలని హెచ్చరించారు. పోలీసులు సైతం చట్టపరిధిలో పనిచేయకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో బెదిరించాలనుకోవడం వారి అవివేకమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa