ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త కుట్రకు తెరలేపిన పాక్ ఉగ్ర సంస్థలు,,,,భారత విద్యార్థులే టార్గెట్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 10:28 PM

పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలు.. అక్కడి ప్రభుత్వం, ఆర్మీ సహాయంతో భారత్‌‍పై నిరంతరం దాడులకు, కుట్రలకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి అని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయింది. పాకిస్తాన్ గడ్డపై యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులు.. ఎప్పటికప్పుడు కొత్త వారిని రిక్రూట్‌మెంట్ చేసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి భారత్‌పైకి ఉసిగొల్పుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్రస్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌లోని ఉగ్ర సంస్థలు ఇప్పుడు మరోవైపు నుంచి భారత్‌పైకి దాడికి సిద్ధం అవుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.


పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ బంగ్లాదేశ్‌లోని రాడికల్ గ్రూపులతో కలిసి భారతీయ విద్యార్థులనురాడికలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లలోకి చొరబడి.. ఇస్లామిక్ అధ్యయన గ్రూపుల ద్వారా భారత విద్యార్థులను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నాయి. ఇండియన్ స్టూడెంట్స్‌ను రాడికలైజ్ చేయడానికి కొత్త ఫ్రంట్‌ను ప్రారంభించాయని ఓ టీవీ ఛానెల్‌కు వెల్లడించాయి.


  పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌గా పేర్కొంటున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి.. మే నెలలో పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చేసిన ఒక ప్రసంగంలోబెంగాల్ విభజనను ప్రస్తావించడం గమనార్హం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సైఫుల్లా కసూరి ప్రసంగం.. రాడికల్ వర్గాల్లో భారత్ వ్యతిరేక సందేశాలను వ్యాప్తి చేయడానికి ఒక ఆయుధంగా మారినట్లు సంబంధిత నివేదిక చెబుతోంది.


బంగ్లాదేశ్‌కు చెందిన రాడికల్ గ్రూపులు, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యకర్తలను యూనివర్సిటీ క్యాంపస్‌లలోకి వెళ్లేందుకు చట్టబద్ధమైన ప్రవేశాన్ని కల్పించాయని తాజాగా నిఘా వర్గాలు పేర్కొనడం సరికొత్త ముప్పుగా మారనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ వారు ఇస్లామిక్ గ్రూపుల ద్వారా భారతీయ విద్యార్థులతో కలిసిపోయి ఉన్నారని పేర్కొన్నాయి. ఇది భారత్‌కు భద్రతాపరంగా కొత్త సవాలును విసురుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థులను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. భారత్‌పైకి దాడులు చేసి భారీగా దెబ్బతిన్న పాక్ ఉగ్ర సంస్థలు ఈ రకంగా కొత్త ఎత్తులకు దిగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com