ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా దిగ్గజ బ్యాంకులకు షాక్

business |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 11:26 PM

నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ మే నెలలో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ సహా అనేక సహకార బ్యాంకులు సహా మొత్తం 26 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జరిమానాలు విధించింది. తాజాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ లెంట్‌బాక్స్‌లు కూడా ఈ జాబితాలో చేరాయి.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డిపాజిటర్ల నిధుల బదిలీ, తాకట్టు లేని వ్యవసాయ రుణాలకు సంబంధించిన నిబంధనల్ని పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 63.6 లక్షల జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో అర్హత కలిగిన నిధులను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్కి బదిలీ చేయకపోవడం సహా రూ. 1.6 లక్షల లోపు వ్యవసాయ రుణాలకు తనఖా సేకరించడం వంటి ఉల్లంఘనలు ఉన్నట్లు 2023 మార్చి, 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పర్యవేక్షక తనిఖీలలో ఆర్బీఐ గుర్తించింది.


ట్రాన్‌సాక్‌ట్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (లెంట్‌బాక్స్): పీర్-టు-పీర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి 2017లో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు ఫిన్‌టెక్ సంస్థ ట్రాన్‌సాక్‌ట్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (లెంట్‌బాక్స్ బ్రాండ్ పేరుతో పనిచేస్తుంది) రూ. 40 లక్షల జరిమానా విధించింది. ఈ రెండు కేసులలో, జరిమానాలు కేవలం నియంత్రణ లోపాల ఆధారంగా విధించినట్లు.. లావాదేవీలు లేదా కస్టమర్ ఒప్పందాల చెల్లుబాటును ప్రభావితం చేయవని ఆర్బీఐ స్పష్టం చేసింది.


ఎస్‌బీఐకి అత్యధిక జరిమానా..


ఈ నెలలో విధించిన జరిమానాలలో అత్యధిక మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై పడింది. మే 9న ఎస్‌బీఐకి రూ. 1.72 కోట్ల జరిమానా విధించారు. 'రుణాలు, అడ్వాన్స్‌లు – చట్టబద్ధమైన, ఇతర ఆంక్షలు', 'కస్టమర్ ప్రొటెక్షన్ – అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో కస్టమర్ల బాధ్యతను పరిమితం చేయడం', 'బ్యాంకుల ద్వారా కరెంట్ ఖాతాల ప్రారంభం – క్రమశిక్షణ అవసరం' వంటి ఆర్బీఐ ఆదేశాలను ఎస్‌బీఐ ఉల్లంఘించిందని ఆర్బీఐ తెలిపింది.


కాగా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలకు గాను రూ. కోటి జరిమానా పడింది. ఈ నెల ప్రారంభంలో, ఆర్బీఐ అనేక ఇతర ప్రముఖ బ్యాంకులపై కూడా జరిమానాలు విధించింది. ఇందులో సైబర్ సెక్యూరిటీ, KYC, డెబిట్, క్రెడిట్ కార్డు మార్గదర్శకాలకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 97.8 లక్షల జరిమానా పడింది.


బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 61.4 లక్షలు, యాక్సిస్ బ్యాంక్‌కు రూ. 29.6 లక్షల జరిమానా పడింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర KYC నిబంధనలను పాటించనందుకు రూ. 29.6 లక్షల జరిమానా విధించారు. వ్యవసాయ రుణాల కోసం వడ్డీ సబ్సిడీ పథకాన్ని అమలు చేయడంలో అవకతవకలకు గాను ఐడీబీఐ బ్యాంకు రూ. 31.8 లక్షల జరిమానా ఎదుర్కొంది. ఇంకా ఈ లిస్టులో యెస్ బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్ ఏజీ సహా అస్కా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (అస్కా, ఒడిశా), స్వర్ణ భారతి సహకార బ్యాంక్ నిమిత (బెంగళూరు), ది షిమోగా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (కర్ణాటక), మంగళూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ (మంగళూరు), ది కర్ణాటక సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ధార్వాడ్), గ్రెవాల్ బ్రదర్స్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (కేరళ) వంటి సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి.


ఆర్బీఐ స్పష్టం చేసినట్లుగా, ఈ జరిమానాలు అన్నీ నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలలోని లోపాల ఆధారంగా విధించింది. కస్టమర్లతో చేసుకున్న ఎటువంటి లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటును ప్రశ్నించడానికి ఇవి ఉద్దేశించబడలేదు. బ్యాంకులలో పారదర్శకత, జవాబుదారీతనం, నియంత్రణ పాటించేలా చూడటమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com