ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుడైన భర్తను బంధించి... ఓ భార్య అరాచకం

Crime |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 11:19 PM

అనంతపురంలో ఓ భార్య.. కట్టుకున్నవాడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. కుటుంబసభ్యులతో కలిసి భర్త పట్ల ఏ భార్యా ప్రవర్తించని తీరుగా వ్యవహరించింది. డబ్బు మీద ఆశతో దివ్యాంగుడైన భర్తపై కనీస కరికరం లేకుండా ప్రవర్తించింది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భార్య కాస్తా అకస్మాత్తుగా అలా మారేసరికి ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్య నుంచి ఊహించని ప్రవర్తనకు షాక్ తిన్నాడు. చివరకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణం బయటి ప్రపంచానికి తెలిసింది.


బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన ఫయాజ్‌కు చిన్నప్పుడే పోలియో వచ్చింది. దీంతో ఇతరుల సాయం లేనిదే నడవలేని పరిస్థితి. కష్టపడి చదువుకున్న ఫయాజ్.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఇటీవల బెళుగుప్ప ఎంపీడీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్న ఫయాజ్.. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ ద్వారా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ షబానా పరిచయమైంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. షేక్ షబానా కుటుంబసభ్యులు కూడా పెళ్లికి అంగీకరించడంతో ఫయాజ్, షేక్ షబానా వివాహం రెండేళ్ల క్రితం జరిగింది. ఆ తర్వాత అనంతపురంలోనే ఓ ఇంటిని తీసుకుని ఈ దంపతులు కాపురం పెట్టారు.


అయితే పెళ్లైన కొత్తలో షబానా చూపించిన ప్రేమకు ఫయాజ్ ముగ్ధుడైపోయారు. భార్యను సంతోషంగా ఉంచేందుకు ఆమె ఏం కావాలని అడిగినా కాదనకుండా ఇస్తూ వచ్చారు. అయితే అప్పుడే షబానాలోని మరో కోణం వెలుగుచూసింది. దివ్యాంగుడైన భర్తను మోసగించి డబ్బులు కాజేయాలనే ప్లాన్ వేసింది. తన ప్లాన్‌లో భాగంగా తన అక్కతో ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ. 30 లక్షలు పర్సనల్ లోన్ తీయించింది. ఈ పర్సనల్ లోన్‌కు ష్యూరిటీగా భర్త ఫయాజ్‌ను ఉంచింది. దీంతో 2024 ఫిబ్రవరి నుంచి నెలకు రూ.60 వేల చొప్పున ఫయాజ్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత అనంతపురంలోని సొంతింటిని ఫయాజ్‌ను ఒప్పించి రూ.40 లక్షలకు అమ్మించింది. ఆ తర్వాత అనంతపురం నుంచి బెళుగుప్పలోని అద్దె ఇంటిలోకి మారారు.


ఇక్కడితో ఊరుకోని షబానా అనంతపురంలో ఫయాజ్‌కు ఉన్న ప్లాట్‌ను కూడా రూ. 7 లక్షలకు అమ్మించింది. రూ.5 లక్షలు ఖర్చు చేసి ఐదు తులాల బంగారు నగలు, తిరగటం కోసం రూ.6 లక్షల విలువైన కారు ఫయాజ్‌తో కొనుగోలు చేసింది. అయితే ఇక్కడితో ఊరుకోని షబానా అనంతపురంలో ఉన్న మరో ఇంటి స్థలాన్ని కూడా అమ్మేయాలని ఇటీవల భర్త ఫయాజ్‌ను కోరింది. దీంతో అవసరం లేకుండా ఎందుకు అమ్మాలంటూ ఫయాజ్ ప్రశ్నించారు. అప్పుడే తన భార్య అసలు స్వరూపం ఏమిటో ఫయాజ్‌కు తెలిసివచ్చింది.


కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించిన షబానా.. తనపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఫయాజ్ చెప్తున్నారు. తల్లిదండ్రులను, అక్కను పిలిపించి తనను ఇంట్లోనే బంధించి.. సామాగ్రిని వాహనంలో వేసుకుని కారుతో పరారైందని ఆరోపించారు.ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, తన సర్టిఫికేట్లతో పాటు రూ.6 లక్షల కారును తీసుకుని ఏప్రిల్‌ 29వ తేదీ తన భార్య పరారైందని ఫయాజ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com