ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. లక్షకు 3 లక్షలు..పసిడి ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్..

business |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:30 PM

బంగారం.. భారతీయులకు అదొక పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్ కూడా! తరతరాలుగా బంగారాన్ని ఆభరణాల రూపంలోనో, నాణేల రూపంలోనో కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కాలం మారుతున్న కొద్దీ బంగారం పెట్టుబడికి కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సార్వభౌమ బంగారు బాండ్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఈ బాండ్లను క్రమానుగతంగా జారీ చేస్తూ వస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు నిజంగా పండగ చేసుకుంటున్నారు. ఇటీవల మాత్రం భారంగా మారిందని గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఇష్యూలు జారీ చేయట్లేదు.


తాజాగా ఆర్బీఐ, 2017-18 సిరీస్ I సార్వభౌమ బంగారు బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్ ప్రకటించింది. ఈ బాండ్లను 2017 మే నెలలో జారీ చేశారు. అప్పుడు ఒక గ్రాము బంగారం బాండ్ ధర రూ. 2951గా ఉంది. ఇప్పుడు, 2025 మే 9న వీటి ఫైనల్ ప్రైస్ యూనిట్‌కు రూ. 9486గా ఖరారు చేసింది. అంటే.. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో ఏకంగా 221 శాతం రాబడి లభించింది! ఇది నిజంగా అద్భుతమైన లాభం అని చెప్పాలి.


అప్పటి పెట్టుబడి.. ఇప్పటి లాభం..


ఒకసారి ఊహించుకోండి.. ఎనిమిదేళ్ల క్రితం మీరు ఈ బాండ్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు మీకు సుమారు 33.88 గ్రాముల బంగారు బాండ్లు వచ్చి ఉండేవి. ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ రూ. 3,21,496కి చేరుకుంది. అంటే మీ లాభం రూ. 2,21,496. ఇది కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చిన లాభం మాత్రమే. దీనికి అదనంగా, మీరు ఈ ఎనిమిది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిపై 2.5 శాతం చొప్పున వడ్డీని కూడా పొందారు. అంటే మీ మొత్తం రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది.


గోల్డ్ బాండ్ స్కీమ్ ఏంటి?


సార్వభౌమ బంగారు బాండ్లు భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇవి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఈ బాండ్లను గ్రాముల రూపంలో కొనుగోలు చేయవచ్చు. వీటి ప్రధాన ప్రయోజనాల విషయానికి వస్తే భౌతిక బంగారాన్ని నిల్వ చేసే ఇబ్బంది ఉండదు. స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్టుబడిపై నిర్ణీత కాలానికి వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీపై వచ్చే లాభాలపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. అవసరమైతే ఐదు సంవత్సరాల తర్వాత ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా 4 కిలోల విలువైన బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడి ఒక గ్రాము బంగారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com