ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో యుద్ధం వస్తే 4 రోజుల్లో పాక్ ఖేల్ ఖతం

international |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:27 PM

భారత్, పాక్ మధ్య ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. తమ సైన్యాలను అప్రమత్తం చేసి.. సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఇక ఆయుధాల తరలింపు, యుద్ధ విన్యాసాలతో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అనే రేంజ్ లోకి వెళ్లిపోయాయి. అయితే భారత్‌తో యుద్ధంలో తలపడే శక్తి లేని పాకిస్తాన్ ముందు నుంచీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఢాంబికాలు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ గురించి.. ఆ దేశ సైన్యం గురించి కీలక విషయాలు బయటికి వచ్చాయి. భారత్ ఏ రకమైన చర్య తీసుకున్నా.. దానికి దీటుగా బదులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ నేతలు పదే పదే చెబుతున్నా.. నిజానికి ఆ పరిస్థితి లేదని అర్థం అవుతోంది.


తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని భారత్‌ను భయపెట్టేందుకు పాక్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ బలహీనతలు బయటపడకుండా ఉండేదుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని అందరికీ అర్థం అయింది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము కూడా పాక్‌కు లేదని ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ వద్ద ఆయుధాలైతే ఉన్నాయి కానీ వాటిలో ఉపయోగించే మందుగుండు సామాగ్రి కొరత మాత్రం తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే కేవలం 4 రోజుల్లోగానే పాక్ మందుగుండు అయిపోతుందని సమాచారం.


అయితే ఇందుకు కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో చేసుకున్న ఆయుధ ఒప్పందాలతో పాకిస్తాన్ తన యుద్ధ నిల్వలు మొత్తం ఖాళీ చేసేలా చేశాయి. ఇదే ఇప్పుడు పాక్ వద్ద మందుగుండు కొరతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. పెరుగుతున్న డిమాండ్, కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పాకిస్తాన్‌కు అవసరమయ్యే మందుగుండు కూడా అక్కడ ఉత్పత్తి జరగడం లేదు. కేవలం 96 గంటల యుద్ధానికి మాత్రమే సరిపోయే నిల్వలు ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది.


ఇక పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పాక్ వద్ద ఎమ్ 109 హోవిట్జర్లకు తగినంత 155 ఎంఎం షెల్స్ లేవు. బీఎం-21 సిస్టమ్స్‌కు అవసరమయ్యే 122 ఎంఎం రాకెట్లు లేవు. ఇవి లేకుండా భారత సైన్యం ముందు యుద్ధంలో నిలవడం దాదాపుగా అసాధ్యం. ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన ఒక ఎక్స్ పోస్టును బట్టి చూస్తుంటే పాకిస్తాన్ వద్ద ఉన్న కీలకమైన 155 ఎంఎం ఫిరంగి షెల్‌లను ఉక్రెయిన్‌కు మళ్లించారని.. వాటి నిల్వలు పూర్తిగా పడిపోయినట్లు తెలిసింది.


ఇక యుద్ధంలో కీలకంగా ఉపయోగపడే మందుగుండు సామాగ్రి లేకపోవడంతో ఒక వేళ భారత్‌తో పోరాడాల్సి వస్తే ఎలా అనే భయం పాకిస్తాన్ సైనిక అధికారుల్లో పట్టుకుంది. ఈనెల 2వ తేదీన జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో కూడా ఇదే సమస్యపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో పాక్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా ఈ విషయాన్ని అంగీకరించాడం గమనార్హం. భారత్‌తో దీర్ఘకాలిక యుద్ధంలో పాక్ సైన్యం పాల్గొనలేదని.. పాక్ వద్ద మందుగుండు సామాగ్రి, ఆర్థిక బలం లేదని బజ్వా తేల్చి చెప్పారు. మరోవైపు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలతో పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. అవన్నీ ఇప్పుడు సైన్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com