ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసిన పాక్

international |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 10:40 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని విషయం అందరికీ తెలిసిందే. పుల్వామా దాడి అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయగా.. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి దాడులే ఎక్కడ చేస్తుందోనని భయపడుతున్న పాక్.. అప్రమత్తం అయింది. తీరం వెంబడి సైనికులను పెంచి.. యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈక్రమంలోనే తాజాగా భూతలం నుంచి భూతలం పైకి 450 కిలో మీటర్ల రేంజ్ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్లామాబాద్ పేర్కొంది. ఇండస్ కసరత్తుల్లో భాగంగా దీన్ని ప్రయోగంచినట్లు వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2019లో పుల్వామా దాడి జరిగి.. అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయగా.. అది ఇప్పటికీ పాకిస్థాన్‌ను భయపెడుతోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తప్పనిసరిగా ప్రతీకార దాడి చేస్తుందని బలంగా విశ్వసిస్తున్న పాక్.. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ లాంటివి చేస్తుందని భావించి అందుకు తగ్గట్లుగా సన్నద్ధం అవుతోంది పాక్. తాజాగా ఇందుకోసం ఓ లాంగ్ రేజ్ బాలిస్టిక్ మిసైల్‌ను కూడా ప్రయోగించింది.


సైనికుల కార్యాచరణ, సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణుల అధునాతతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఇండస్ కసరత్తుల్లో భాగంగా దానిని ప్రయోగించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఏప్రిల్ 30 - మే 2వ తేదీ మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాక్ తరచూ ఇటువంటి ప్రకటనలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని భారత రక్షణశాఖ అధికారులు మండిపడ్డారు.


పహల్గాం దాడి తర్వాత గత తొమ్మిది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులు జరుపుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తమపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని పాక్ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తమ సరిహద్దులో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని బాడ్‌మెర్‌లోని లాంగేవాలా సెక్టార్‌కు అటువైపు ఉన్న ప్రాంతంలో రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాక్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa