ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న ఏడ్చాడు, ఇవాళ ఏడ్పించాడు,,,సూర్యవంశీ సంచలనం

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 11:34 PM

14 ఏళ్లకే ఐపీఎల్ ఆడటమంటేనే అదొక సంచలనం. అలాంటిది సెంచరీ చేశాడు. అది కూడా అలా ఇలా కాదు. సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లోనే శతకం చేశాడు. రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అతడే వైభవ్ సూర్యవంశీ.. ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు నయా సంచలనం.


అవును.. 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ‘వైభవ్ సూర్యవంశీ’ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకున్నాడు. కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. హేమాహేమీ బౌలర్లను సైతం ఉతికారేస్తూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.


గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జెయింట్స్‌‌తో తొలి మ్యాచ్ ఆడగా.. 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో స్టంపవుట్ అయిన వైభవ్.. పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లటం అందరినీ కదిలించింది. ఈరోజు మాత్రం తన కసిని, అసలైన సత్తాను చూపించాడు వైభవ్. వైభవ్ చెలరేగిపోతుంటే, ముచ్చటపడ్డాడో ఏమో.. మరో ఎండ్‌లో యశస్వి జైశ్వాల్ అతడికి చక్కగా సహకరించాడు.


210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్‌ సూర్యవంశీ అదిరే ఆరంభం ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కుర్రాడు.. మరో 18 బంతుల్లో మరోసారి ఫిఫ్టీ మార్కు అందుకున్నాడు. దీంతో 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. చివరకు 38 బంతుల్లో 101 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.


ఐపీఎల్ మొదలయ్యేనాటికి పుట్టనేలేదు


2011లో బీహార్‌లోని తాజ్‌పుర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా.. అప్పటికింకా వైభవ్ పుట్టనేలేదు. ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్లకు పుట్టాడు.. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్‌ పట్టడం చూసిన అతడి తండ్రి. ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు.


ఆ తర్వాత క్రికెట్‌లో రాణించిన వైభవ్.. పదేళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో.. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. దీంతో అండర్‌-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్‌తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.


నిజానికి వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025 మెగావేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ వేలంలోకి వచ్చాడు. అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంఛైజీలు.. అతడి కోసం పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిద్ అతడిని ఏరి కోరి తీసుకున్నాడు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు సొంతం చేసుకుంది. మేనేజ్‌మెంట్ అంచనాలను అందుకుంటూ అతడు సత్తా చాటుతున్నాడు.


వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్.. 15.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (101)తో పాటు యశస్వి జైశ్వాల్ (70 పరుగులు, 40 బంతుల్లో, నాటౌట్‌) బ్యాట్ ఝుళిపించడంతో ఘన విజయం సాధ్యమైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. 4 వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే గుజరాత్ టైటాన్స్ ఆశలకు రాజస్థాన్ కళ్లెం వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com