ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింద ఉగ్రవాదుల కాల్పులు.. గాల్లో పర్యటకుడి ఎంజాయ్.

national |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 10:37 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘనటలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. కేవలం పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఓ పర్యటకుడు జిప్‌లైన్‌పై రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అతడికి తెలియకుండానే.. కింద ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.


ఏప్రిల్ 22వ తేదీ మంగళ వారం రోజు పహల్గాం సమీప బైసరన్ లోయలో భీకర ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మధ్యాహ్నం 3 గంటలకు సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులపై కాల్పులకు తెగబడ్డారు. కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. మీది ఏ మతం అని, కల్మా చదవమంటూ మరీ.. ముస్లిం కాని వారందరినీ హత్య చేశారు. ఓవైపు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. కాళ్లపై పడ్డా ఏమాత్రం కనికరం చూపకుండా వారి ఎదుటే కాల్పులు జరిపారు. ఇలా క్షణాల్లోనే వారందరి ప్రాణాలు తీశారు.


కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోగా.. అప్పటి నుంచి పోలీసు అధికారులు, భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని నాలుగు సార్లు ట్రాక్ చేయగా.. చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోయారు. అయితే ఈ మారణహోమానికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఏ ఒక్క వీడియోలోనూ క్లారిటీ లేదు. కానీ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను చిత్రీకరించాడు. అందులో ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపడం, వారు పరుగులు పెట్టడం కనిపిస్తున్నాయి.


అహ్మదాబాద్‌కు చెందిన రిషి భట్ అనే వ్యక్తి.. జిప్‌లైన్‌పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే ఈ రైడ్ మొత్తాన్ని సదరు వ్యక్తి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అయితే అతడి గాల్లో ఉండగా.. కింద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈయన గాల్లో ఉండి నవ్వుతుండగా.. కింద పర్యటకులు కేకలు వేస్తూ ఏడుస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడిలో ఓ వ్యక్తి చనిపోయిన దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే దిగువన జరుగుతున్న విషయాలు ఏవీ ఆ పర్యాటకుడు గుర్తించినట్లు వీడియోలో కనిపించలేదు. మరోవైపు పర్యటకుడిని రైడ్‌కు పంపే ముందు జిప్‌లైన్ ఆపరేటర్.. మూడు సార్లు అల్లా హు అక్బర్ అంటూ చెప్పి అతడిని ముందుకు తోశాడు. ఆ సమయంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.


అయితే మధ్యలోకి వెళ్లిన తర్వాత తనకు కాల్పులు జరుగుతున్నాయని తెలిసిందని.. తన భార్య, కుమారుడు కిందకు దిగమని కేకలు వేయడం వినిపించిందని రిషి భట్ పేర్కొన్నాడు. మొదట్లో తనకు కింద ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా.. తెలిసిన వెంటనే తన జిప్‌లైన్‌ను ఆపేసి 15 మీటర్ల పైనుంచి కిందకు దూకి భార్య, కుమారుడి చెంతకు చేరినట్లు తెలిపాడు. ఆపై వారిద్దరినీ తీసుకుని చాలా సేపటి వరకు పరిగెట్టి.. ఓ తోటలో దాక్కున్నామని.. కాల్పులు ఆగిపోయాకే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించాడు. ఇలా ఈ దాడి నుంచి తన కుటుంబాన్ని తప్పించానని చెప్పుకొచ్చాడు. అలాగే ఆపరేటర్ తన భార్య, మిగతా స్నేహితులు వెళ్తున్నప్పుడు అల్లా హు అక్బర్ అని చెప్పలేదని, కానీ తనను పంపేటప్పుడు మాత్రమే అలా చెప్పాడని వివరించాడు. మొత్తంగా తన కళ్ల ముందే 18 హత్యలు జరిగాయని ఆ మారణ హోమాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com