ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త పన్ను విధానంలో ఇలా లక్షల్లో ఆదా.. ఎంత ఆదాయంపై ఎంత

business |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 10:43 PM

 పన్ను చెల్లింపుదారులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆదాయపు పన్ను విధానం మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. సెక్షన్ 87A కింద పెంచిన పన్ను రాయితీ (టాక్స్ రిబేట్), సవరించిన ఆదాయపు పన్ను శ్లాబ్‌ల కారణంగా ఈ విధానం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త విధానాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే వీరు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. 2026-27 మదింపు సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే ఈ ఆదా పొందొచ్చు. కిందటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసే వారికి బడ్జెట్‌కు ముందటి శ్లాబులే వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. మరి ఈ ఆదా చేసిన మొత్తాన్ని ఎలా తెలివిగా ఉపయోగించాలో తెలుసుకునే ముందు, కొత్త విధానంతో ఎంత ఆదా చేసుకోవచ్చో చూద్దాం!


ఇటీవలి బడ్జెట్‌లో పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ, కొత్త విధానం మాత్రం పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్‌ల పరిధిని పెంచడంతో పాటు, వివిధ ఆదాయ స్థాయిల్లో పన్ను రేట్లను తగ్గించారు. గతంలో రూ. 15 లక్షలు దాటిన ఆదాయంపై 30 శాతం పన్ను విధించేవారు. అయితే, కొత్త విధానంలో ఈ పరిమితిని రూ. 24 లక్షలకు పెంచారు. దీనివల్ల లక్షల్లో పన్ను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, సెక్షన్ 87ఏ కింద లభించే రాయితీ పరిధిని కూడా పెంచారు.


గతంలో రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ రాయితీ వర్తించేది, ఇప్పుడు దానిని రూ. 12 లక్షల వరకు పెంచారు. దీని ఫలితంగా రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వేతన జీవులు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో లిపి రూ. 12.75 లక్షల వరకు పైసా పన్ను కట్టనక్కర్లేదు. ఈ ఒక్క మార్పుతోనే ప్రతి ఒక్కరూ గరిష్టంగా రూ. 1,10,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.


పన్ను లెక్కలు ఇవే..


ఇప్పటివరకు ఉన్న కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ మీ ఆదాయం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ఉంటే, గతంలో రూ. 30,000 పన్ను చెల్లించాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అది పూర్తిగా ఉండదు. అలాగే, రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు గతంలో రూ. 50,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు ఆ భారం లేదు. రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు గతంలో రూ. 80,000 పన్ను కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు.


ఇక అధిక ఆదాయ వర్గాల విషయానికి వస్తే, రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు రూ. 35,000 వరకు, రూ. 15 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉన్నవారు రూ. 50,000 వరకు, రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉన్నవారు రూ. 90,000 వరకు, రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఏకంగా రూ. 1,10,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. రూ. 24 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు కూడా రూ. 1,10,000 వరకు పన్ను ఆదా పొందుతారు.


పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త విధానం చాలా మందికి లాభదాయకంగా మారనుంది. ముఖ్యంగా ఎలాంటి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయని వారికి ఇది మరింత ప్రయోజనకరం. ఒకవేళ మీరు గత సంవత్సరం పాత విధానంలో ఉండి, ఇప్పుడు కొత్త విధానానికి మారితే మీ పన్ను ఆదా మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, వార్షిక ఆదాయం రూ. 16 లక్షలు ఉన్నవారు పాత విధానంలో రూ. 2,92,500 పన్ను చెల్లించాల్సి రాగా, కొత్త విధానంలో కేవలం రూ. 1,20,000 మాత్రమే చెల్లిస్తారు, అంటే రూ. 1,72,500 ఆదా అవుతుంది. అదేవిధంగా, రూ. 20 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 2,12,500 మరియు రూ. 25 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 2,32,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.


ఇలా ఆదా చేసిన డబ్బును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..


ఊహించని ఖర్చుల కోసం మీ నెలవారీ ఖర్చులకు 6 నుంచి 12 రెట్లు అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి.


అధిక వడ్డీతో ఉన్న వ్యక్తిగత లేదా క్రెడిట్ కార్డ్ రుణాలను ఈ డబ్బుతో త్వరగా చెల్లించండి.


పదవీ విరమణ లేదా పిల్లల చదువుల కోసం సరైన పెట్టుబడులు పెట్టండి.


మీరు వాయిదా వేసిన విహారయాత్ర లేదా ఇతర కోరికలను ఈ డబ్బుతో నెరవేర్చుకోండి.


మీకు ఇష్టమైన సంగీతం నేర్చుకోవడం లేదా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో చేరడం వంటి వాటిపై దృష్టి పెట్టండి.


ఈ విధంగా కొత్త పన్ను విధానం ద్వారా ఆదా చేసిన డబ్బును తెలివిగా ఉపయోగించడం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com