ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో చేరి పెద్ద తప్పు చేశాను.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 08:56 PM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఆదివారం పటాన్‌చెరులోని జీఎమ్మార్ ఫంక్షన్ హాల్లో తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ భేటీలో ఆయన చేసిన పశ్చాత్తాప వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.


మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన కేడర్‌ను ఉద్దేశించి మహిపాల్ రెడ్డి ఏమాన్నారంటే.. గతంలో నెలకొన్న కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల.. ఒత్తిడికి లోనై తప్పటడుగు వేశాను. ఆ నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది.. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వ్యక్తిగతంగా నాకు గానీ.. నా నియోజకవర్గ అభివృద్ధికి గానీ.. నన్ను నమ్ముకున్న ప్రజలకు గానీ కనీసం వెంట్రుక వంతు కూడా లాభం జరగలేదన్నారు.


పటాన్‌చెరు ప్రజలు నన్ను వరుసగా మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ గౌరవం, గుర్తింపు నాకు గులాబీ జెండా వల్లే లభించాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో మన సత్తా చాటాలి. 104 మంది కౌన్సిలర్ అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


వార్డుల వారీగా, విభాగాల వారీగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. మన గడ్డపై మళ్లీ గులాబీ జెండానే ఎగరాలన్నారు. మహిపాల్ రెడ్డి ఈ స్థాయి వ్యాఖ్యలు చేయడానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పాత కాంగ్రెస్ నేతలతో ఆయనకు పొసగడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత, తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడులు ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు సమాచారం.


మరోవైపు.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు నుండి ఎదురవుతున్న ఒత్తిడి, అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న భయంతోనే.. తాను పార్టీ మారలేదు, ఇప్పటికీ బిఆర్ఎస్ సభ్యుడినే అని నిరూపించుకోవడానికి ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు.. మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుని.. తిరిగి బీఆర్ఎస్‌లో క్రియాశీలకం కావడమే ఆయన అసలు లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa