ఖమ్మం జిల్లాలోని కల్లూరు మేజర్ పంచాయతీ దశ మారి మున్సిపాలిటీగా అవతరించింది. ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన కల్లూరులో ఇప్పుడు రాజకీయ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం రిజర్వేషన్లను ఖరారు చేయగా, మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు కేటాయించబడింది. దీంతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులను ఏర్పాటు చేస్తూ అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు కూడా ఈ స్థానం ఎస్టీలకే రిజర్వు కావడం విశేషం. ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా అదే రిజర్వేషన్ కొనసాగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వార్డుల వారీగా కేటాయింపులు జరగడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ముఖ్యంగా హనుమాతండా, గన్యాతండా, చంద్యాతండా, లక్ష్మాతండా మరియు వాచ్చా నాయక్ తండాలు మేజర్ పంచాయతీలో విలీనం కావడం వల్లే ఈ రిజర్వేషన్ ఖరారైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తండాల కలయికతో ఎస్టీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. భౌగోళికంగా, జనాభా పరంగా వచ్చిన ఈ మార్పులు చైర్మన్ పీఠాన్ని ఎస్టీ జనరల్కు దక్కేలా చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మున్సిపాలిటీగా మారిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పాత పంచాయతీ నేపథ్యం, కొత్త తండాల కలయికతో కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa