ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలుగుతుందనే అనుమానంతో ఖమ్మం రూరల్ మండలం మరియు ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే సీపీఎం ముఖ్య నాయకుల ఇళ్లకు చేరుకున్న పోలీసులు, వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఆకస్మిక అరెస్టులతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
అరెస్టు అయిన వారిలో సీపీఎం సీనియర్ నాయకులు నండ్ర ప్రసాద్, వడ్లమూడి నాగేశ్వరరావు, కారుమంచి గురవయ్య తదితరులు ఉన్నారు. తమను అక్రమంగా అరెస్టు చేయడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యమని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని వామపక్ష నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటనను సాకుగా చూపి అక్రమ నిర్బంధాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు పేర్కొన్నారు. అరెస్టులతో భయపెట్టాలని చూస్తే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుండటంతో, ఎక్కడా నిరసనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ అరెస్టుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa